Begin typing your search above and press return to search.

కేసీఆర్ రాజకోట రహస్యం చెప్పిన విజయశాంతి

By:  Tupaki Desk   |   16 April 2019 11:16 AM IST
కేసీఆర్ రాజకోట రహస్యం చెప్పిన విజయశాంతి
X
తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తోపాటు టీఆర్ ఎస్ లో నంబర్ 2గా వెలుగొందారు విజయశాంతి. ఆమెకు కేసీఆర్ గుట్టుమట్లు - టీఆర్ ఎస్ అంతర్గత వ్యవహారాలు అన్నీ తెలుసు. కేసీఆర్ తో పడకే బయటకు వచ్చేశారు. తాజాగా విజయశాంతి కేసీఆర్ చేస్తున్న రెవెన్యూ ప్రక్షాళన వెనుక పెద్ద కుట్ర ఉందని సంచలన నిజాలను బయటపెట్టారు. రెండేళ్ల క్రితం మియాపూర్ భూకుంభకోణం వెలుగుచూసినప్పుడు మొత్తం రెవెన్యూ ప్రక్షాళన చేస్తానని కేసీఆర్ ప్రకటనలు గుప్పించారని.. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం చేశారో చెప్పాలని విజయశాంతి డిమాండ్ చేశారు.

టీఆర్ ఎస్ కు చెందిన బడానేతలకు మియాపూర్ భూకుంభకోణంలో సంబంధాలు ఉన్నాయని తేలడంతోనే రెవెన్యూ శాఖ ప్రక్షాళన అంశాన్ని కేసీఆర్ అటకెక్కించారని విజయశాంతి విమర్శించారు. ఇందులో సీనియర్ నేత కేశవరావును కేసీఆర్ బలిపశువును చేశాడని ఆరోపించారు. ఈ కుంభకోణంలో చివరకు ఏం చర్యలు తీసుకోలేదని.. ప్రభుత్వం చేతులెత్తేసిందని ఆరోపించారు.

మియాపూర్ లో చాలామంది టీఆర్ ఎస్ నేతలను కాపాడిన కేసీఆర్.. బీసీ వర్గానికి చెందిన కేశవరావును బలిచేశారని.. ఆ భూ వివాదాన్ని టీఆర్ ఎస్ ప్రభుత్వం పక్కదోవ పట్టించిందని ఆరోపించారు. కేశవరావు చివరకు తాను కొన్న భూములను ప్రభుత్వానికి అప్పజెప్పాల్సి వచ్చిందని అన్నారు.

కేశవరావు ఉదంతం బయటపడ్డప్పుడే కేసీఆర్ రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయడానికి నడుం బిగించి ఉండాల్సిందని.. అంతా అయిపోయాక.. ఇప్పుడు చేస్తున్నారంటే దీనివెనుక రాజకోటరహస్యం ఉందని ఆరోపించారు. ఇది త్వరలోనే బయటపడుతుందని.. అందులో ఉన్న అసలు మర్మం తెలియడానికి ఎంతో కాలం పట్టదని విజయశాంతి స్పష్టం చేశారు.