Begin typing your search above and press return to search.

ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో 16 మందిని కాపాడిన వీడియో

By:  Tupaki Desk   |   8 Feb 2021 9:49 AM IST
ఉత్తరాఖండ్ వరద బీభత్సంలో 16 మందిని కాపాడిన వీడియో
X
పర్యావరణ సమతుల్యం దెబ్బ తింటే ఎలాంటి విపత్తులు ఏర్పడతాయన్న మాటకు నిలువెత్తు రూపంగా దేవభూమిలో జలవిలయం చోటు చేసుకుంది. ఉత్తరాఖండ్ లో చోటు చేసుకున్న భారీ జలవిలయం దేశ ప్రజల్ని షాక్ కు గురి చేసింది. పర్యావరణం గురించి లైట్ తీసుకునే పాలకులకు.. ప్రజలకు వెన్నులో వణుకు పుట్టేలా తాజా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఉత్తరాఖండ్ రాష్ట్రం చమోలీ జిల్లా జోషిమఠ్ సమీపంలోని నందాదేవి హిమానీనదంలోని పెద్ద మంచు చరియలు విరిగి ధౌలీగంగ నదిలో పడటంతో.. ఒక్కసారిగా భారీ వరదలు సంభవించాయి.

దీంతో.. ధౌలీగంట ఉగ్రరూపానికి ఒక జలవిద్యుత్కేంద్రం పేకమేడలా కూలిపోవటమే కాదు.. గాలి వాటానికి అట్టముక్క ఎలా అయితే పడిపోతుందే.. భారీ జలవిలయానికి విద్యుత్ కేంద్రం కొట్టుకుపోయింది. సున్నితమైన హిమాలయాల ఎగువ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో 170 మంది గల్లంతయ్యారు. తాజాగా చోటు చేసుకున్న పరిణామానికి ధౌలీగంగ సాధారణ నీటి మట్టానికి మించి మూడు మీటర్ల ఎత్తున నీరు ప్రవహిస్తోంది. జలవిద్యుత్కేంద్రంలో పని చేస్తున్న 170 మంది కార్మికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. జలవిద్యుత్తు కేంద్రానికి సంబంధించిన సొరంగం పనులు జరుగుతున్నాయి. ఆకస్మాత్తుగా అందులోకి వరద నీరు ప్రవేశించటంతో.. వారంతా అందులో చిక్కుకున్నారు. దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వరద తీవ్రతను తెలిపే ఈ వీడియోలో పదహారు మంది కార్మికులను ఐటీబీపీ.. ఎస్ డీఆర్ఎఫ్ దళాలు రక్షించాయి. జలవిద్యుత్ కేంద్రంలో ఎంతమంది పని చేస్తున్నారన్న దానిపై ప్రాజెక్టు అధికారులు స్పష్టమైన వివరాలు వెల్లడించలేదు.

దీంతో.. గల్లంతైన వారి సంఖ్య మరింత పెరిగే సూచనలు ఉన్నాయి. 250 మీటర్ల పొడవు ఉన్న ఆ సొరంగంలోకి జవాన్లు అతి కస్టమీద 150 మీటర్ల వరకు వెళ్లగలిగారు. అయితే.. అక్కడ ఎవరి ఆచూకీ లభించలేదు. చీకట్లు కమ్ముకోవటంతో సహాయక చర్యలు నిలిచిపోయాయి. ఈ రోజు మళ్లీ కొనసాగనున్నాయి. దీంతో.. మిగిలిన వారి భద్రతపై ఆందోళన వ్యక్తవుతోంది.