Begin typing your search above and press return to search.

వ్యూస్ కాదు న్యూస్ ఇవ్వండి.. మీడియా సంస్థలకు చురకలాంటి మాట

By:  Tupaki Desk   |   7 March 2022 4:07 AM GMT
వ్యూస్ కాదు న్యూస్ ఇవ్వండి.. మీడియా సంస్థలకు చురకలాంటి మాట
X
తెలుగు నుడికారం మీద ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడికి ఉన్న పట్టు అంతా ఇంతా కాదు. ఇదే తీరును ఆయన తెలుగుతో పాటు ఇంగ్లిషు.. హిందీల్లోనూ ప్రదర్శించి అందరిని ఆశ్చర్యచకితుల్ని చేస్తారు. ఎంత అలవోకగా ఆయన మాటలు ఉంటాయో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరమే ఉండదు. తాజాగా ఆయన హైదరాబాద్ లో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. అలనాటి దిగ్గజ పాత్రికేయుడు ముట్నూరి కృష్ణారావు రాసిన సంపాదకీయాల్ని ఒక పుస్తకంగా వేశారు. ఆ పుస్తకాన్నిఆవిష్కరించేందుకు వచ్చిన వెంకయ్య.. ఈ సందర్భంగా మీడియా ఎలా ఉండాలన్న విషయాన్ని చెబుతూనే.. ప్రజాస్వామ్య దేశంలో మీడియా అవసరాన్ని ఆయన తెలియజేశారు.
ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా పాత్ర అత్యంత కీలకమన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉండే మీడియా దాన్ని కాపాడే బాధ్యత ఉందన్నారు.

ప్రభుత్వాలకు.. ప్రజలకు మధ్య వారధిలా ఉంటూ సమస్యల పరిష్కారం కోసం పాత్రికేయం పోషిస్తున్న పాత్రను ఆయన గుర్తు చేశారు. ఈ సందర్భంగా మీడియా అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ.. ఏం చేయాలి? ఏం చేయకూడదన్న దానిపై ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ఈ మాటలు చురకలుగా పడ్డాయని చెప్పక తప్పదు.

ప్రచార..ప్రసార మాధ్యమాలపై ప్రజల్లో ఎన్నో ఆశలు.. అంచనాలు ఉంటాయని పేర్కొన్న వెంకయ్య.. చాలా విషయాలను తమకు అర్థమయ్యే రీతిలో పత్రికలు వివరిస్తారనే ప్రజలు భావిస్తారన్నారు. అందుకు అనుగుణంగా సమాజంలో మార్పులు తెచ్చేందుకు పత్రికలు కీలక భూమిక పోషించాలన్నారు.

‘‘నిజాల్ని నిక్కచ్చిగా.. వాస్తవాలకు తమ అభిప్రాయాల్ని జోడించకుండా ఉన్నది ఉన్నట్లుగా సమాచారాన్ని చేరవేయటమే ఉత్తమ పాత్రికేయం’’ అని వెంకయ్య పేర్కొన్నారు. సత్యానికి దగ్గరగా పత్రికలు ఉండాలన్న అభిలాషను వ్యక్తం చేసిన ఆయన.. సంచలనాలకు దూరంగా ఉండాలన్నారు.

వార్తలు.. వ్యక్తిగత అభిప్రాయాలు రెండింటిని కలిపి ప్రచురించరాదన్నారు. ప్రభుత్వ విధానాల్లో ఏమైనా లోపాలు ఉంటే.. వాటిని ఎత్తి చూపించే బాధ్యత మీడియా మీద ఉందన్నారు. అదే సమయంలో చిన్న చిన్న అంశాలను భూతద్దంలో చూపిస్తూ ప్రజల్ని భయాందోళనకు గురి చేయటం సరికాదన్నారు. న్యూస్ ను వార్తలుగా ఇచ్చి.. వ్యూస్ ను సంపాదకీయాల్లో పేర్కొనాలన్నారు.

ఈ సమాజంలో తాము కూడా భాగస్వామ్యులమనే విషయాన్ని పాత్రికేయులు గుర్తించుకోవాలన్న ఆయన.. ‘‘మనం రాసే ఒక్కొక్క అక్షరం తన చుట్టూ ఉన్న సమాజంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తుందన్న విషయాన్ని బేరీజు వేయగలగాలి. అక్షరంపై సంపూర్ణ సాధికారత ఉన్న వారు పాత్రికేయంలో తమ ప్రత్యేకతను చాటుకుంటారు. ఇందులో నాటి కృష్ణా పత్రిక సంపాదకులు శ్రీ ముట్నూరి కృష్ణారావు గారు మొదటి వరసలో నిలుస్తారు. పత్రికలు లేని ప్రజాస్వామ్యాన్ని ఊహించలేం. మనిషి జీవిత విధానాన్ని.. ఆలోచన క్రమాన్ని సరైన మార్గంలో పెట్టే శక్తి పత్రికలకు ఉంది. ఈ శక్తిని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం పత్రికలకు ఉండాలి’’ అని మీడియాకు హితవు పలికారు.

ఈ సందర్భంగా శ్రీ ముట్నూరి కృష్ణారావు గురించి చెబుతూ.. ‘‘బ్రిటిషర్ల పాలనా కాలంలో యువతలో దేశభక్తిని నూరిపోసి, స్వరాజ్య కాంక్షను రేకెత్తించి జాతీయోద్యమం దిశగా ముందుకు నడిపించేందుకు కృషి చేసిన పత్రికల్లో తెలుగునాట కృష్ణా పత్రికకు ప్రత్యేక స్థానం ఉంది.

దాదాపు నాలుగు దశాబ్దాలపాటు కృష్ణా పత్రిక సంపాదకీయం ద్వారా శ్రీ ముట్నూరి వారు ప్రవేశపెట్టిన ఒరవడే తర్వాతి తరం పాత్రికేయులకు మార్గదర్శనం చేసింది. వారి నిరుపమానమైన దేశభక్తి, సమాజం కోసం ఏదో ఒకటి చేయాలన్న ఆకాంక్ష వెరసి వారిని పాత్రికేయ వృత్తివైపు నడిపించాయి. మొండివారు అని పేరుగాంచిన వారి సంపాదకీయాలు అధ్యయన గ్రంథాలు అని చెప్పడం అతిశయోక్తి కాదు’’ అని పేర్కొన్నారు.

‘తెల్లవారిని తుపాకులతో కాల్చుట’ అన్న ముట్నూరి కృష్ణారావు గారి సంపాదకీయం గురించి మాట్లాడిన వెంకయ్యనాయుడు.. ‘‘ఆ రోజుల్లో అలాంటి శీర్షిక పెట్టడమంటే దేశం కోసం ప్రాణాలను కూడా వదులుకునేందుకు వెనుకాడకపోవడమే. దీనికి తోడుగా సుతిమెత్తగా, చురకలు అంటిస్తూ విమర్శించే ఓవిధమైన గడుసుదనం మూట్నూరు వారి రచనల్లో తొంగిచూసేదన్నారు. ఏమైనా ఉప రాష్ట్రపతి హోదాలో వెంకయ్య చేసిన సూచనలు ఇప్పుడున్న పరిస్థితుల్లో మీడియాకు అవసరమనే చెప్పాలి.