Begin typing your search above and press return to search.

కేసీఆర్ మాట‌ల‌కు ఫిదా అయిపోయిన వెంక‌య్య‌

By:  Tupaki Desk   |   21 Aug 2017 5:07 PM IST
కేసీఆర్ మాట‌ల‌కు ఫిదా అయిపోయిన వెంక‌య్య‌
X
మాట‌ల మంత్రికుడైన బీజేపీ నేత‌ - కేంద్ర మాజీ మంత్రి - ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు ప్ర‌సంగం అంటే ఎంద‌రికో ఆస‌క్తి ఉంటుంది. భాష‌పై వెంక‌య్య ప‌ట్టు, ఆయ‌న వ్య‌క్తీక‌రించే శైలిలో వెంక‌య్య‌ను ప్ర‌శంసించే వారి సంఖ్య భారీగా ఉంటుంది. అయితే అలాంటి వెంక‌య్య త‌న‌కంటే బాగా మాట్లాడ‌గ‌లుగుతున్నార‌ని కితాబు ఇచ్చారంటే...స‌ద‌రు వ్య‌క్తికి ఎంతో ప‌ట్టు ఉన్న‌ట్లే క‌దా? అలా వెంక‌య్య‌ను ఫిదా చేసింది ఎవ‌రో కాదు...తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు. ఉప‌రాష్ట్రప‌తిగా ఎంపికైన వెంక‌య్య నాయుడుకు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున మొట్ట‌మొద‌టి పౌర‌స‌న్మానాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ సార‌థ్యంలో చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య తెలంగాణ సీఎంపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపించారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడే తీరు తనకు బాగా నచ్చుతుందని ఉప రాష్ట్రప‌తి వెంక‌య్య నాయుడు అన్నారు. ఆయన జనానికి అర్థమయ్యే భాషలోనే మాట్లాడుతార‌ని పేర్కొన్నారు. అట్ల మాట్లాడితేనే ప్రజలకు మనం మాట్లాడేది అర్థమవుతుందన్నారు. కేసీఆర్ ఉపన్యాసం షడ్రపోపేత భోజనంలా ఉంటుందని కొనియాడారు. తెలుగు భాషలో గ్రామరే కాదు.. గ్లామర్ కూడా ఉందని అలా రెంటిపై ప‌ట్టున్న వ్య‌క్తి కేసీఆర్ అని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తనకు పౌరసన్మానం చేయడం గొప్పగా ఉందని ఉపరాష్ర్టపతి వెంకయ్యనాయుడు అన్నారు. రాష్ర్ట గవర్నర్ నరసింహన్ - సీఎం కేసీఆర్ కు ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక‌ ధన్యవాదాలు చెప్పారు. హైదరాబాద్ అన్న.. తెలంగాణ అన్న తనకెంతో ఇష్టమన్నారు.

తాను మంచి భోజనప్రియుడిని.. భాషా ప్రియుడిని అని పేర్కొన్నారు.ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌ పై సైతం వెంక‌య్య నాయుడు ప్ర‌శంస‌లు కురిపించారు. హైదరాబాద్ ను ఒక మినీ భారత్ అనడంలో అతిశయోక్తి లేదన్నారు. తాను పుట్టింది నెల్లూరు.. చదివింది విశాఖలో.. రాజకీయంగా పెరిగింది.. ఒదిగింది.. ఎదిగింది మాత్రం హైదరాబాద్ లోనే అని వెంకయ్యనాయుడు చెప్పారు. హైదరాబాద్ తో తనకెంతో సంబంధం ఉందన్నారు. హైదరాబాద్ లో రాజకీయంగా ఎదిగానని చెప్పడానికి ఎంతో గర్వపడుతున్నానని చెప్పారు. ప్రపంచ పటంలో హైదరాబాద్ కు ప్రత్యేక స్థానం ఉందన్నారు. హైదరాబాద్ అంటే ఉత్తరాది వాళ్లకి దక్షిణాది.. దక్షిణాది వాళ్లకి ఉత్తరాది అని వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ బిర్యానీ - హలీంకు ప్రత్యేకత ఉందన్నారు. తెలంగాణలో తాను అన్ని ప్రాంతాల్లో ప‌ర్య‌టించాన‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా ఉప రాష్ట్రప‌తి తెలుగువారికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ``మన భాషను మనం మరిచిపోకూడదు. మాతృభాషను మరిచిపోయినవాడు మనిషే కాదు. ఇంగ్లీష్ కూడా తప్పనిసరి అయినప్పటికీ.. తెలుగును మరిచిపోకండి. మన భాష ద్వారానే మన సంస్కృతి ప్రస్ఫుటిస్తుంది` అని స్పష్టం చేశారు. తెలుగు భాషాభివృద్ధికి రెండు రాష్ర్ట ప్రభుత్వాలు కలిసి చర్యలు తీసుకోవాలని సూచించారు. రెండు తెలుగు రాష్ర్టాలు తెలుగు భాషను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు వెంకయ్య. ప్రజలకు అర్థమైన భాషలో పాలన ఉండాలి. వ్యవహారిక భాషగా.. పాలనా భాషగా తెలుగు ఉండాలన్నది తన కోరిక అని వెంకయ్య పేర్కొన్నారు.