Begin typing your search above and press return to search.

ఈరోజుతో అయిపోయేది కాదంటున్న వెంకయ్య!

By:  Tupaki Desk   |   8 Sept 2016 10:18 AM IST
ఈరోజుతో అయిపోయేది కాదంటున్న వెంకయ్య!
X
ఆంధ్రప్రదేశ్‌ కు అటు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, ఇటు ప్యాకేజీ ఇవ్వకుండా కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఒక కంటి తుడుపు ప్రకటన చేసిన అనంతరం ఏపీ ఆశాజ్యోతి అని చెప్పుకునే వెంకయ్య నాయుడు మాట్లాడారు. తనదైన శైలిలో మాట్లాడటం మొదలుపెట్టిన వెంకయ్య.. ఏపీని ప్రత్యేక రాష్ట్రంగా పరిగణిస్తామని.. కేంద్రం నుంచి అన్ని విధాలా సాయాన్ని అందిస్తామని చెప్పారు. అడిగింది ప్రత్యేక హోదా ఇస్తామని చెబుతుంది మాత్రం ప్రత్యేక రాష్ట్రంగా చూడటం, ప్రత్యేక ప్యాజేకీ అని పాతకథనే కొత్తగా చెప్పడం ఇక్కడ గమనార్హం.

ఇదే ఫ్లో కంటిన్యూ చేసిన వెంకయ్య నాయుడు.. ఇప్పటికే అనేక ప్రాజెక్టులు - విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్ కు మంజూరు అయ్యాయని - మిగిలిన గిరిజన వర్సిటీ - కడప స్టీల్ ప్లాంట్ ల ఏర్పాటుపై కూడా ఒక టాస్క్‌ ఫోర్స్‌ ను నియమించామని తెలిపారు. ఏపీకి కేంద్ర సాయం చేయడం అనేది అలా మొదలై, ఇలా ముగిసిపోయేది కాదని నిరంతరం సాయం చేస్తూ వస్తోందని చెప్పుకొచ్చారు.

విభజన సమయంలో ఏపీకి చాలా నష్టం జరిగిందని, ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని మిగతా రాష్ట్రాలతో సమాన స్థాయికి వచ్చే వరకు ఏపీకి అన్ని విధాల సాయపడతామని చెబుతూనే.. విభజన చట్టంలో పేర్కొన్న వాటిలో ఇప్పటికే చాలా విషయాలు అమలు చేసేశామని చెప్పారు. మిగిలిన వాటినీ త్వరలో చేసేస్తాం అని తెలిపారు. విభజన చట్టంలో కొన్ని చోట్ల "సాధ్యాసాధ్యాలు (ఫీజిబిలిటీ)" అనే మాట వాడారని, కాబట్టి ఆ నివేదికలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని వెంకయ్య ప్రకటించారు.