Begin typing your search above and press return to search.

తెలుగు రాష్ర్టాల్లో ఇప్పుడు వెంక‌య్యే హాట్ టాపిక్‌

By:  Tupaki Desk   |   7 Dec 2017 11:33 PM IST
తెలుగు రాష్ర్టాల్లో ఇప్పుడు వెంక‌య్యే హాట్ టాపిక్‌
X
రాజ్యసభ సభ్యులైన జనతాదళ్ (యు) నేత శరద్‌యాదవ్ - అలీ అన్వర్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని, ఫిర్యాదు వచ్చిన నెలలోపే రాజ్యసభ చైర్మన్ కూడా అయిన ఉప‌రాష్ట్రప‌తి వెంకయ్యనాయుడు విచారించి, సభాహక్కుల సంఘానికి సైతం పంపకుండా వారిద్దరిపై అనర్హత వేటు వేయడం రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింన సంగ‌తి తెలిసిందే. మిగిలిన చట్టసభల మాదిరిగా అనర్హత ఫిర్యాదులపై ఏళ్లపాటు పెండింగ్‌లో ఉంచకుండా, సత్వర నిర్ణయంతో రాజకీయాల్లో నైతిక విలువలు పాటించిన వెంకయ్యనాయుడు నిర్ణయాన్ని ప్రజాస్వామ్యవాదులు ప్రశంసిస్తున్నారు. ఒక పార్టీ నుంచి ఎన్నికైన సభ్యుడెవరైనా తమ పార్టీ నిర్ణయంపై బహిరంగంగా విమర్శించినా, వేరే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నా అర్హులేనన్న పదో షెడ్యూల్ నిబంధన ప్రకారం, వారిద్దరిపై వేటు వేయడాన్ని రాజకీయ పార్టీలు స్వాగతిస్తున్నాయి. శరద్‌యాదవ్ మరొక పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నారని ఆయన ప్రత్యర్థులు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

అయితే తెలుగుబిడ్డ‌, ఉప‌రాష్ట్రప‌తి అయిన‌ వెంకయ్యనాయుడు తాజా వ్యాఖ్యలు, చ‌ర్య‌లు ఇద్దరు ఎంపీలపై ఆయన తీసుకున్న నిర్ణయం ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్పీకర్లు, ప్రభుత్వాలకు నైతిక సంకటంలా పరిణమించగా, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలలో ఉత్సాహం నింపాయని అంటున్నారు. ఎందుకంటే...సభ్యుల అనర్హతపై నిర్ణయం ఆలస్యమైతే ఫిరాయింపు నిరోధక చట్టం లక్ష్యాన్ని దెబ్బతీసినట్లేనని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. అనర్హతపై అందిన ఫిర్యాదులను అసెంబ్లీ ప్రిసైడింగ్ అధికారులు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్న ఆయన తాజా వ్యాఖ్య ప‌లువురిని ఆలోచ‌న‌లో ప‌డేసింది.

పార్టీ ఫిరాయింపుల చట్టం అమలుపై ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లకు నైతిక సంకటంలా పరిణమించింది.తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఫిరాయింపు కేసులపై ప్రభావం చూపుతుందా? అన్న చర్చకు తెరలేపింది. ఇప్పటికే ఏపీలో 22 మంది, తెలంగాణలో 20 మంది శాసనసభ్యులు వైసీపీ, కాంగ్రెస్,టీడీపీ, సీపీఐ నుంచి పార్టీ ఫిరాయించారు. వారిలో రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలు ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం కూడా కల్పించడం విమర్శలకు గురయిన విషయం తెలిసిందే.

పార్టీ మారిన తమ సభ్యులపై అనర్హత వేటు వేయాలని, రెండు రాష్ట్రాల ప్రతిపక్షాలు ఏడాదికి పైగానే స్పీకర్లకు ఫిర్యాదు చేశాయి. గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లాయి. కొందరు వ్యక్తిగతంగా కోర్టుకెళ్లారు. తాజాగా ఉప రాష్టప్రతి వెంకయ్యనాయుడు తీసుకున్న నిర్ణయం, చేసిన వ్యాఖ్యలు ఏపీ - తెలంగాణ స్పీకర్లకు ఆదర్శం కావాలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

రెండు రాష్ర్టాల ముఖ్యమంత్రులు, ప్ర‌భుత్వాలు ఓ వైపు వెంకయ్యనాయుడు సేవలను, ఆయన పాటించే నైతిక విలువలను కొనియాడుతూ అనర్హత విషయంలో ఆయన మార్గాన్ని ఎందుకు అనుసరించరన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకొస్తున్నాయి. ప్రధానంగా వెంకయ్యను విపరీతంగా ప్రస్తుతించే ఏపీ ప్రభుత్వం, స్పీకర్ ఫిరాయింపులపై ఆయన తీసుకున్న నిర్ణయాన్ని తాము కూడా ఎందుకు పాటించడం లేదన్న చర్చకూ సహజంగా తెరలేచింది. దీనిపై వెంక‌య్య స‌న్నిహితుడిగా ప్ర‌క‌టించుకునే...ఆయ‌నే త‌మ‌కు ఢిల్లీలో పెద్ద దిక్కు అని అంత‌ర్గ‌త సంభాష‌ణ‌ల్లో చెప్పే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఏం స‌మాధానం ఇస్తారో చూడాలి మ‌రి.