Begin typing your search above and press return to search.

రాజీవ్‌ గాంధీ హత్యపై వెంకయ్య నాయుడు హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!

By:  Tupaki Desk   |   14 Nov 2022 6:00 AM IST
రాజీవ్‌ గాంధీ హత్యపై వెంకయ్య నాయుడు హాట్‌ కామెంట్స్‌ వైరల్‌!
X
మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్యపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు హాట్‌ కామెంట్స్‌ చేశారు. ఒక దేశ మాజీ ప్రధానిని హత్య చేసినవారిని విడుదల చేయడం సరికాదన్నారు. రాజకీయాల్లో అభిప్రాయ భేదాలు ఉండొచ్చన్నారు. అలాగే విభేదాలు కూడా ఉంటాయన్నారు. అయితే రాజీవ్‌ గాంధీని చంపినవారిని విడుదల చేయడం సరికాదని వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగుతున్న కోటి దీపోత్సవాలకు వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీవ్‌గాంధీ హంతకుల విడుదలతో తన మనసు ఎంతో కలత చెందిందని భావోద్వేగానికి లోనయ్యారు.

దీపం వెలుగు అజ్ఞానాన్ని తొలగిస్తుందని.. వెలుగుతోనే మనిషి మనుగడ సాధ్యమని వివరించారు. కార్తీకమాసంలో శాంతి, ధర్మం వర్ధిల్లాలని ఆకాంక్షించారు. సమాజం బాగు కోసం కోటి దీపోత్సవాలను నిర్వహించడం అభినందనీయమని వెంకయ్య నాయుడు అభినందించారు.

కాగా కొద్ది రోజుల క్రితం రాజీవ్‌ గాంధీ హత్య కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఐదుగురు నిందితులు నళిని, జయకుమార్, ఆర్‌పీ రవిచంద్రన్, రాబర్ట్‌ పయస్, సుధేంద్ర రాజా, శ్రీధరన్‌లను సుప్రీంకోర్టు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. వీరంతా గత 30 ఏళ్లుగా జైలుశిక్ష అనుభవిస్తున్నారు.

సుప్రీంకోర్టు నిర్ణయంపై కాంగ్రెస్‌ నేతలు జైరామ్‌ రమేష్‌ వంటివారు ఇప్పటికే అభ్యంతరాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సైతం అవే అభ్యంతరాలు వ్యక్తం చేయడం గమనార్హం. రాజీవ్‌ గాంధీని హత్య చేసినవారిని విడుదల చేయడాన్ని వెంకయ్య ఖండించారు.

గతంలో రాజ్యసభ సభ్యుడిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వెంకయ్య నాయుడు బిజీబిజీగా ఉండేవారన్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఏడాది ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా ఆయన పదవీకాలం ముగిసింది. రాష్ట్రపతిగా, మరోసారి ఉపరాష్ట్రపతిగా చాన్స్‌ ఇస్తారని వార్తలు వచ్చినా అవి నిజం కాలేదు.

దీంతో ఆయన ఖాళీ సమయాన్ని స్నేహితులతో, కుటుంబ సభ్యులతో గడపడానికి ప్రాధాన్యమిస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తన ఆత్మీయులను కలుస్తున్నారు. వివిధ పాఠశాలలు, కళాశాలలను సందర్శించి తన అభిప్రాయాలను వారితో పంచుకుంటున్నారు.