Begin typing your search above and press return to search.

బాబుని భయపడొద్దని చెబుతున్న వెంకయ్య!

By:  Tupaki Desk   |   5 Sept 2016 10:26 AM IST
బాబుని భయపడొద్దని చెబుతున్న వెంకయ్య!
X
నోటుకు ఓటు సంఘటన జరినప్పటినుంచి చంద్రబాబు వైఖరిలో పూర్తి మార్పు వచ్చిందని, ఆయనపై ఈ విషయంలో కేంద్రంవద్ద కేసులు పెండింగ్ లో ఉన్నాయని, ఈ విషయంలో కేసీఆర్ - చంద్రబాబులకు బీజేపీ పెద్దలే రాజీ కుదుర్చారని రాజకీయాల్లో రకరకాల గాసిప్పులు ప్రచారంలో ఉన్నాయి. పైగా 10ఏళ్ల పాటు హైదరాబాద్ లో అధికారికంగా అనుమతి ఉన్నప్పటికీ.. ఉన్నట్లుండి విజయవాడకు వెళ్లిపోవడానికి కూడా ఓటుకు నోటే కారణమని కూడా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఇలాంటి విషయాలపై భయపడాల్సిన పనేమీ లేదని చెబుతున్నారు వెంకయ్య నాయుడు.

ఇప్పటికే ఏపీలోని ప్రధాన ప్రతిపక్షం వైకాపా - ఇతర రాజకీయ పార్టీలు.. ఓటుకు నోటుకు భయపడే రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెడుతున్నారని, ఓటుకు నోటు కు బదులు ప్రత్యేక హొదాను బలిస్తున్నారని రకరకాల ఆరోపణలు చేస్తున్నారు. ఇదే సమయంలో తిరుపతి సభలో కూడా పవన్ ప్రసంగిస్తూ.. కేసులు పెడతారని భయపడకండి, అలాంటి అనుమానాలను పెంచకండి, కేంద్రంపై పోరాడండి అని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

ఈ విషయాలపై స్పందించిన వెంకయ్య... ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంతో పోరాడటానికి చంద్రబాబు భయపడుతున్నారని కొంతమంది అంటున్నారు - ఆయనకు అక్కడ ఏవో కేసులు వంటివి ఉన్నాయని అంటున్నారు. కానీ.. చంద్రబాబు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు.. ఆయనకు సంబంధించి విచారణ ప్రతిపాదనలేవీ కేంద్రం వద్ద లేవు అని క్లారిటీ ఇచ్చారు. ఈ మాటలు విన్న కొందరైతే.. చూశారా - చంద్రబాబుపై "అవేమీ" లేవని వెంకయ్య గారే చెప్పారు అంటుంటే.. ఈ మాటలు నిజమే అయితే ఇప్పటివరకూ ఉన్న అనుమానాలు - భయాలు పక్కనపెట్టి ఇక ప్రత్యేక హోదాపై పోరాడితే బెటరేమో అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు!