Begin typing your search above and press return to search.

విషాదంగా వీకెండ్ ఎంజాయ్.. అమెరికాలో వేములవాడ కుర్రాడు దుర్మరణం

By:  Tupaki Desk   |   31 May 2022 5:30 AM GMT
విషాదంగా వీకెండ్ ఎంజాయ్.. అమెరికాలో వేములవాడ కుర్రాడు దుర్మరణం
X
ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన తెలుగు కుర్రాడు ప్రాణాలు కోల్పోయిన వైనం తాజాగా చోటు చేసుకుంది. వీకెండ్ వేళ విహారయాత్రకు వెళ్లిన అతగాడి ప్రాణాల్ని తీసింది. స్నేహితులతో కలిసి సరదాగా వెళ్లిన ట్రిప్.. అనూహ్యంగా విషాదానికి కారణమైంది. ఎనిమిది నెలల క్రితమే ఎమ్మెస్ చేసేందుకు ఫ్లోరిడా వెళ్లిన అతను ప్రాణాల్ని కోల్పోవటంతో అతని తల్లిదండ్రులకు పుత్రశోకం తప్పలేదు. షాకింగ్ మారిన ఈ ఉదంతంలోకి వెళితే..

వేములవాడలోని సుభాష్ నగర్ కు చెందిన ప్రభుత్వ ఉద్యోగి మల్లయ్య కుమారుడు యశ్వంత్ (25). ఎమ్మెస్ చేయటం కోసం ఎనిమిది నెలల క్రితం అమెరికాలోని ఫ్లోరిడా వెళ్లారు. వీకెండ్ వేళ ఐదుగురు స్నేహితులతో కలిసి ఐర్లాండ్ లోని దీవులకు యశ్వంత్ వెళ్లారు.

అక్కడ ప్రైవేటు బోటును తీసుకొని పిటా దీవులకు చేరుకున్నారు. అదే రోజు సాయంత్రం ఐదున్నర గంటల వేళలో.. వారు అద్దెకు తీసుకున్న బోట్ ను స్టార్ట్ చేయగా.. స్టార్ట్ కాలేదు.

అయితే.. అలల తాకిడికి బోటు మూడు మీటర్ల లోతు నుంచి పాతిక మీటర్ల లోతున్న ప్రాంతానికి చేరుకుంది. ఈ విషయాన్ని గుర్తించని యశ్వంత్ నోటిలో ఈత కొట్టేందుకు దిగారు. ఆ సమయంలో అలల తీవ్రత ఎక్కువగా ఉండటంతో అతను బోటుకు దూరమయ్యాడు.

ఈ విషయాన్ని గుర్తించిన అతని మిత్రులు వెంటనే లైఫ్ జాకెట్స్ ధరించి నీటిలో దిగి మూడు గంటల పాటు గాలించినా ఫలితం లేకపోయింది. జరిగిన ప్రమాదం గురించి పోలీసులకు తెలుపగా.. వారు రంగంలోకి దిగా రాత్రి వేళకు డెడ్ బాడీని గుర్తించారు. పెద్ద చదువులుచదువుతాడని దేశం కాని దేశానికి పంపితే చివరకు ప్రాణాలు కోల్పోయిన వైనంతో ఆ పెద్ద వయసులో ఉన్న తల్లిదండ్రులు గుండెలు అవిసేలా ఏడస్తున్నారు.