Begin typing your search above and press return to search.

జనసేనలోకి వంగవీటి రాధా?

By:  Tupaki Desk   |   28 Dec 2020 2:00 PM IST
జనసేనలోకి వంగవీటి రాధా?
X
వంగవీటి రాధాకృష్ణ పార్టీ మారబోతున్నారా..? సైకిల్ దిగి జనసేన గూటికి చేరబోతున్నారా..? ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇదే చర్చ నడుస్తోంది. గతంలో ఓసారి పవన్ కల్యాణ్ తో భేటీ అయిన రాధా.. లేటెస్ట్ గా జనసేనలో నెంబర్ 2గా వ్యవహరిస్తున్న నాదెండ్ల మనోహర్ తో భేటీ కావడంతో సందేహాలు మరింతగా పెరిగాయి.

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాన్.. సోమవారం నాడు మచిలీపట్నం కలెక్టరేట్ కు రాబోతున్ననారు. అక్కడ కలెక్టర్ ను కలిసి నివర్ తుపాను బాధిత రైతులను ఆదుకోవాలని కోరబోతున్నారు. ఈ నేపథ్యంలో పవన్ పర్యటన ఏర్పాట్లను పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. ఈ ఏర్పాట్లలో బిజీగా ఉన్న మనోహర్ ను వంగవీటి రాధా కలిశారు. దీంతో అందరి దృష్టీ వీళ్ళ భేటిపైనే పడింది.

ప్రస్తుతం రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అయితే.. పార్టీలో అంత యాక్టివ్ గా లేరు. ఎప్పుడో ఓసారి చంద్రబాబునాయుడును కలిసి చర్చించటం లేకపోతే అమరావతి రైతుల దీక్షలో మాత్రమే కనిపిస్తున్నారు. అంతే తప్ప.. పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా క్రియాశీలకంగా వ్యవహరించడం లేదు రాధా. దీంతో.. త్వరలోనే ఆయన టీడీపీని వదిలేస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో ఈ ప్రచారం కొనసాగుతుండగానే.. ఒకసారి పవన్, మరోసారి మనోహర్ తో భేటీ అయ్యారు. లేటెస్ట్ గా మరోసారి మనోహర్ ను కలుసుకోవడంతో అనుమానాలు మరింత బలపడుతున్నాయి.

అయితే.. ఇదివరకే కొందరు బీజేపీ నేతలతో కూడా వంగవీటి మంతనాలు జరిపారు. దీంతో.. రాధాకృష్ణ జనసేన, బీజేపీల్లో ఏ కండువా కప్పుకుంటారు? అన్న సస్పెన్స్ మొదలైంది. అయితే.. బాగా కొనసాగిన ఈ ప్రచారం.. ఆ తర్వాత సద్దుమణిగింది. చాలా కాలం తర్వాత నాదెండ్లతో రాధా భేటీ అవ్వటంతో మళ్ళీ పార్టీ మార్పు ప్రచారం మొదలైంది. సోమవారం మచిలీపట్నంలో పవన్ తో కూడా భేటీ అవుతారని సమాచారం.

కాగా.. వంగవీటి బీజేపీ, జనసేనల్లో దేనికి జై కొడతారు? అని అంటే.. జనసేనకే అంటున్నారు చాలా మంది. ప్రస్తుతం పవన్ వెంట నాాదెండ్ల తప్ప, మరో పెద్ద నేత కనిపించట్లేదు. అందువల్ల జనసేనలో చేరితే మంచి గుర్తింపు వస్తుందని భావిస్తున్నాడట. అంతేకాకుండా.. సామాజికవర్గపరంగా లాభిస్తుందనే యోచనలో ఉన్నాడట రాధా. మరి, ఫైనల్ గా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? అసలు పార్టీ మారతారా లేదా? అన్నది చూడాలి.