Begin typing your search above and press return to search.

టీడీపీకి ఎన్టీఆర్ ఎందుకు దూరమయ్యారంటే..: వంశీ

By:  Tupaki Desk   |   15 Nov 2019 7:14 AM GMT
టీడీపీకి ఎన్టీఆర్ ఎందుకు దూరమయ్యారంటే..: వంశీ
X
2009లో టీడీపీ గెలుపుకోసం రాష్ట్రమంతా పర్యటించిన సినీ హీరో, నందమూరి వారసుడు ఎన్టీఆర్ ఇప్పుడు ఎందుకు టీడీపీకి దూరంగా ఉంటున్నారన్నది అంతుచిక్కని ప్రశ్న. 2009లో ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని అప్పటి టీడీపీ నేతలుగా ఉన్న వల్లభనేని వంశీ, కొడాలి నానిలు స్వయంగా ఎన్టీఆర్ ను ఒప్పించి తీసుకొచ్చారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్టీఆర్ ఎందుకు మళ్లీ టీడీపీవైపే రావడం లేదు..? ఈ ప్రశ్నకు తాజాగా టీడీపీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరిన వల్లభనేని వంశీ ఆసక్తికర సమాధానం చెప్పాడు. ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు తెరవెనుక రాజకీయంపై చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఓ మీడియా సంస్థతో మాట్లాడిన వంశీ దీని గుట్టువిప్పాడు.

ఎన్నికల ఫలితాల తర్వాత ఎన్టీఆర్ కు చంద్రబాబే పొగబెట్టాడని వంశీ సంచలన కామెంట్ చేశారు. ఎన్టీఆర్ పై తప్పుడు ప్రచారాలు చేయించాడని తెలిపారు. దీంతో ఆత్మాభిమానం అడ్డువచ్చి ఎన్టీఆర్ ఇప్పుడు టీడీపీకి పూర్తిగా దూరంగా ఉంటున్నారని వంశీ సంచలన నిజాలు చెప్పుకొచ్చాడు. అధికారం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని.. ఎన్టీఆర్ ను దూరం పెట్టింది అందుకేనని అన్నారు. 2014లో పవన్ కళ్యాణ్ ఇంటికెళ్లి చంద్రబాబు బతిమిలాడింది అందుకేనన్నారు.

ఎన్టీఆర్ కు సన్నిహితుడైన కొడాలి నాని వైసీపీలో మంత్రిగా ఉండడం.. ఇప్పుడు వంశీ కూడా వైసీపీలో చేరడంతో ఎన్టీఆర్ కూడా వైసీపీలోకి వస్తారా అని వంశీని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ఎన్టీఆర్ ప్రస్తుతం గొప్ప సినిమాలు చేస్తూ సంతోషంగా ఉన్నాడని.. భవిష్యత్తు గురించి తాను చెప్పలేనంటూ దాటవేశాడు. ఎప్పటికైనా రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడని.. కానీ వైసీపీలోకి వస్తాడని మాత్రం స్పష్టత ఇవ్వలేనని చెప్పుకొచ్చాడు.