Begin typing your search above and press return to search.

అతి త్వరలో చిన్నారులకు 'వ్యాక్సిన్' ...ట్ర‌య‌ల్స్ కంప్లీట్ !

By:  Tupaki Desk   |   7 Oct 2021 7:16 AM GMT
అతి త్వరలో చిన్నారులకు వ్యాక్సిన్ ...ట్ర‌య‌ల్స్ కంప్లీట్  !
X
దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. దేశంలో జరుగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్యంగా కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ వి వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పటి వరకూ చిన్నారులకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులో రాలేదు. కోవాగ్జిన్ చిన్నారులకిచ్చే విషయం ట్రయల్స్ పూర్తి చేసుకుని, డీసీజీఐ అనుమతి కోసం వేచి చూస్తోంది. 8 ఏళ్లు పైబ‌డిన వారికి ప్ర‌స్తుతం వ్యాక్సిన్ అందిస్తున్నారు. కాగా, 18 ఏళ్ల లోపున్న వారికి వ్యాక్సిన్ అందించేందుకు భార‌త్ బ‌యోటెక్ సిద్ధం అవుతున్న‌ది.

ఇప్ప‌టికే చిన్నారుల కోసం త‌యారు చేసిన కోవాగ్జిన్ టీకాకు సంబంధించిన ట్ర‌య‌ల్స్‌ ను భార‌త్ బ‌యోటెక్ సంస్థ పూర్తిచేసింది. ఈ ట్ర‌య‌ల్స్ కు సంబంధించిన డేటాను భార‌త ఔష‌ద నియంత్ర‌ణ సంస్థ కు అంద‌జేసింది. చిన్నారుల‌పై రెండు, మూడు ద‌శ‌ల ట్ర‌య‌ల్స్‌ను పూర్తి చేసిన‌ట్టు పేర్కొన్న‌ది. డీసీజీఐ అనుమ‌తి ల‌భిస్తే ఇండియాలో పిల్ల‌ల‌కు టీకాలు ప్రారంభం అవుతాయ‌ని కోవాగ్జిన్ తెలియ‌జేసింది. త్వ‌ర‌లోనే అనుమ‌తులు ల‌భించే అవ‌కాశం ఉన్న‌ట్టు భార‌త్ బ‌యోటెక్ పేర్కొన్న‌ది. నెల‌కు 10 కోట్ల డోసుల ఉత్ప‌త్తి సామ‌ర్థ్యాన్ని పెంచుకునేందుకు ప్ర‌య‌త్నాలు మొదలుపెట్టిన‌ట్టు భార‌త్ బ‌యోటెక్ తెలియ‌జేసింది.

దీనికి సంబంధించి ఇండియ‌న్ ఇమ్యూనాలాజిక‌ల్స్‌, హెస్ట‌ర్ బ‌యో సైన్సెస్‌ తో ఒప్పందం చేసుకున్న‌ట్టు భార‌త్ బ‌యోటెక్ సంస్థ తెలియ‌జేసింది. దేశంలో కొత్త‌గా 22,431 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో దేశంలో వెల్లడైన క‌రోనా కేసుల మొత్తం సంఖ్య 3,38,94,312కి పెరిగింది. నిన్న క‌రోనా నుంచి 24,602 మంది కోలుకున్నారు. దీంతో కోలుకున్న వారి సంఖ్య మొత్తం 3,32,00,258కి చేరింది. అలాగే, నిన్న 318 మంది క‌రోనాతో మృతి చెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 4,49,856కు చేరింది. ప్ర‌స్తుతం 2,44,198 మంది ఆసుప‌త్రులు, హోం క్వారంటైన్ల‌లో చికిత్స తీసుకుంటున్నారు. నిన్న దేశంలో 43,09,525 వ్యాక్సిన్ డోసులు వేశారు. దీంతో మొత్తం వినియోగించిన వ్యాక్సిన్ డోసుల సంఖ్య 92,63,68,608కి పెరిగింది. కేర‌ళ‌లో నిన్న 12,616 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. 134 మంది క‌రోతో ప్రాణాలు కోల్పోయారు.