Begin typing your search above and press return to search.

జగ్గారెడ్డి మాటకు విలువ లేకుండా చేసిన ఉత్తమ్

By:  Tupaki Desk   |   18 Aug 2020 1:30 AM GMT
జగ్గారెడ్డి మాటకు విలువ లేకుండా చేసిన ఉత్తమ్
X
కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అవసరార్థం మాటలు మార్చేస్తుంటారు. కాంగ్రెస్ అధిష్టానంతో సంబంధం లేకుండా వ్యాఖ్యానిస్తుంటారు. పెద్దరికానికి పోయి అభాసుపాలు అవుతుంటారు.

ఈ మధ్య టీఆర్ఎస్ ను పొగుడుతున్న జగ్గారెడ్డి తన నియోజకవర్గ అభివృద్ధి కోసం బద్ధ శత్రువైన హరీష్ రావుతో కూడా భేటి కావడం కాంగ్రెస్ వర్గాలకు కోపం తెప్పించింది. అయితే తాను పనుల కోసమే కలిశానని చెప్పుకున్నాడు.

ఇక తాజాగా రామలింగారెడ్డికి సంతాపం తెలిపిన కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ప్రతిపాదన చేశారు. రామలింగారెడ్డి మృతితో వచ్చే ఉప ఎన్నికల్లో ఆయన భార్యకే టికెట్ ఇవ్వాలని.. అలా టీఆర్ఎస్ ఇస్తేనే ఆయనకు నివాళి అర్పించినట్టు అన్నారు. రామలింగారెడ్డి భార్యకు టికెట్ ఇస్తే ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీపెట్టకుండా ఏకగ్రీవానికి పీసీసీ చీఫ్ ఉత్తమ్ తో తాను మాట్లాడుతానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.ఇక దామోదర, గీతారెడ్డితో మాట్లాడి ఒప్పించే ప్రయత్నా చేస్తానని.. అవసరం అయితే హరీష్ రావుతో సమన్వయం చేసి రామలింగారెడ్డి కుటుంబానికి న్యాయం చేస్తానన్నారు.

అయితే తాజాగా జగ్గారెడ్డికి గట్టి షాకిచ్చారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. రామలింగరెడ్డి మృతితో ఖాళీ అయిన స్థానంలో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీచేస్తుందని స్పష్టం చేశారు. జగ్గారెడ్డి మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిగతమని.. మండలాల వారీగా సమావేశాలు పెట్టి ఎన్నికలకు సమాయత్తం అవుతామని తెలిపారు.

గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరణించిన సీట్లలో టీఆర్ఎస్ పోటీచేసిందని.. అందుకే తామూ పోటీచేస్తామని ఉత్తమ్ తెలిపారు.

దీంతో జగ్గారెడ్డి ఏకగ్రీవం చేస్తామని.. టీఆర్ఎస్ కు ఫేవర్ గా చేసిన ప్రతిపాదనను ఉత్తమ్ అంగీకరించకుండా ఎన్నికలకు వెళ్లడం జగ్గారెడ్డికి షాకింగ్ గా మారింది. జగ్గారెడ్డి మాటకు కాంగ్రెస్ లో విలువ లేకుండా పోయిందన్న ప్రచారం సాగుతోంది. మరి దీనిపై ఆయన ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.