Begin typing your search above and press return to search.

హుజూర్ నగర్ కు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   15 Sept 2019 10:27 AM IST
హుజూర్ నగర్ కు అభ్యర్థిని ప్రకటించిన కాంగ్రెస్
X
ఉప ఎన్నికల వేడి మొదలుకానుంది. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎంపీలుగా గెలిచిన ఎమ్మెల్యేల కారణంగా ఉప ఎన్నికలు అనివార్యం కానున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇటీవల జరిగిన ఎంపీ ఎన్నికల్లో నల్గొండ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించటం తెలిసిందే. దీంతో ఆయన ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న హుజురాబాద్ కు ఉప ఎన్నికను నిర్వహించనున్నారు. ఇక్కడ నుంచి పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ అధినాయకత్వం తన అభ్యర్థిని ఖరారు చేసింది.

అనవసరమైన చర్చలకు అవకాశం ఇవ్వని రీతిలో.. విమర్శలు వచ్చినా వాటిని ఎదుర్కోవటానికి సిద్దమన్నట్లుగా అభ్యర్థిని ఎంపిక చేసిన వైనం ఆసక్తికరంగా మారింది. ఉత్తమ్ సతీమణి పద్మావతి రెడ్డిని కాంగ్రెస్ అభ్యర్థిగా డిసైడ్ చేశారు. 2018లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదాడ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పద్మావతి రెడ్డి ఓటమిపాలయ్యారు. ఆమెకు మరో అవకాశాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ.

తన తీరుకు భిన్నంగా ముందస్తుగానే ఉప ఎన్నికకు అభ్యర్థిని నిర్ణయించేసింది కాంగ్రెస్ పార్టీ. ఉప ఎన్నికల నోటిషికేషన్ విడుదలకు ముందే అభ్యర్థిని ఎంపిక చేసిన వైనం చూస్తే.. ఈ ఎన్నికల్లో గెలుపు తప్పనిసరి అన్నట్లుగా కాంగ్రెస్ ఆలోచనలో ఉన్నట్లు కనిపించక మానదు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ .. టీడీపీ.. టీజేఎస్ లు కలిసి పోటీ చేసి అనూహ్యంగా కాంగ్రెస్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కేవలం 19 సీట్లలో మాత్రము గెలవటం.. తదనంతరం పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ తో పార్టీని విడిచి పెట్టి.. టీఆర్ఎస్ లో తమ పార్టీని కలిపేయటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వేరే వారికి టికెట్ ఇస్తే.. స్థానికంగా తలనొప్పులు రావటంతోపాటు.. వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. దీంతో.. మరెవరికీ ఎలాంటి అవకాశం ఇవ్వని కాంగ్రెస్.. తన భార్యను గెలిపించుకునే బాధ్యతను ఉత్తమ్ చేతిలో పెట్టినట్లుగా చెబుతున్నారు. ఉత్తమ్ సతీమణికి కాంగ్రెస్ టికెట్ ఇచ్చిన వైనం చూస్తే.. తన ఆశలన్ని ఉత్తమ్ పైనే పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. నియోజకవర్గంపై ఉత్తమ్ కున్న పట్టు నేపథ్యంలో..ఉప ఎన్నికల్లో ఆమెకు టికెట్ ను కన్ఫర్మ్ చేసినట్లుగా చెబుతున్నారు.