Begin typing your search above and press return to search.

అమెరికాలో బైడెన్ గెలుపు ఖాయమైనట్లే! ఎలా చెబుతున్నారంటే?

By:  Tupaki Desk   |   4 Nov 2020 11:00 AM IST
అమెరికాలో బైడెన్ గెలుపు ఖాయమైనట్లే! ఎలా చెబుతున్నారంటే?
X
ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై క్లారిటీ వచ్చేస్తుంది. ఓవైపు కొన్ని రాష్ట్రాల్లో పోలింగ్ సాగుతుండగానే.. మరోవైపు మరికొన్ని రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు మొదలైంది. తొలుత నువ్వా? నేనా? అన్న రీతిలో సాగిన ఫలితాల వెల్లడి.. గంటలు గడిచే కొద్దీ గెలుపుపై క్లారిటీ వచ్చేస్తుంది. భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 11 గంటల వేళకు.. డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ అమెరికాకు తదుపరి అధ్యక్షుడు కావటం ఖాయమని తేలిపోయింది. ఇప్పటికే మెజార్టీ ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సొంతం చేసుకోవటంతో పాటు.. బైడెన్.. ట్రంప్ కు మధ్య ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల వ్యత్యాసం అంతకంతకూ పెరిగిపోతోంది.

పలు మీడియా సంస్థలు.. వివిధ సంస్థలు వెల్లడించిన సర్వే ఫలితాలన్ని బైడెన్ కు అనుకూలంగా ఉండటం తెలిసిందే. ఈ అంచనాలకు తగ్గట్లే.. తాజాగా బైడెన్ అధ్యక్ష పదవిని చేపట్టటం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం బైడెన్ కు 213 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రాగా.. ట్రంప్ 118 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను సంపాదించారు. ఇరువురి మధ్యలో భారీ తేడా ఉండటంతో.. బైడెన్ గెలుపు ఖాయమని చెప్పక తప్పదు.

అమెరికాలో మొత్తం 580 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు ఉండగా.. 270 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను గెలుచుకున్న వారు అధ్యక్ష పీఠాన్ని అధిరోహిస్తారు. తాజాగా చూస్తే.. లక్ష్యమైన 270కు బైడెన్ కు ఇప్పటికే 213 రావటంతో.. ఆయన గెలుపు ఖాయమని చెప్పక తప్పదు. ఇప్పటికి 36 రాష్ట్రాల ఫలితాలు వెల్లడి కాగా.. మరో పద్నాలుగు రాష్ట్రాల ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తం 570 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లకు ఇప్పటికి 331 ఫలితాలు వెల్లడయ్యాయి. ఇంకా 239 ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ఫలితాలు తేలాల్సి ఉంది. ఇందులో చెరి సగం వేసుకున్నా బైడెన్ గెలుపు సునాయసంగా చెప్పక తప్పదు.

బైడెన్ కు భారీగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు తెచ్చిన రాష్ట్రాల విషయానికి వస్తే కాలిఫోర్నియా (55)... న్యూయార్కు (29).. ఇల్లినాయిస్ (20).. మరో ఐదు రాష్ట్రాల్లో పదకొండుకు పైగా ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు రావటం గమనార్హం. ఇక.. ట్రంప్ విషయానికి వస్తే.. ఆయనకు పదకొండు ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు పడిన రాష్ట్రాలు కేవలం మూడు మాత్రమే ఉన్నాయి. మిస్సౌరిలో 10.. ఇండియానాలో 11.. టెన్నెసీలో 11 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లు వచ్చాయి. మిగిలిన రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్లను దాటని పరిస్థితి.