Begin typing your search above and press return to search.

రాజ్‌ ఘాట్‌ లో మహాత్ముడికి నివాళులర్పించిన ట్రంప్..విజిటర్స్ బుక్ లో ఏం రాసారంటే!

By:  Tupaki Desk   |   25 Feb 2020 9:00 AM GMT
రాజ్‌ ఘాట్‌ లో మహాత్ముడికి నివాళులర్పించిన ట్రంప్..విజిటర్స్ బుక్ లో ఏం రాసారంటే!
X
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఆయన సతీమణి ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్‌లు మంగళవారం ఉదయం ఢిల్లీలోని రాజ్‌ఘాట్ సమాధిని సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులు అర్పించారు. గాంధీ సమాధి వద్ద ట్రంప్ దంపతులు పుష్పగుచ్ఛాన్ని ఉంచి నిమిషం పాటు మౌనం పాటించారు. రాష్ట్రపతి భవన్ నుంచి నేరుగా రాజ్‌ ఘాట్ కు వచ్చిన ట్రంప్ దంపతులు గాంధీజీ సమాధిని సందర్శించారు. ఈ సందర్భంగా ట్రంప్‌కు అక్కడున్నవారు గాంధీ మెమొంటోను బహుమతిగా అందించారు. గాజు గ్లాసులో ఉన్న గాంధీ విగ్రహాన్ని ట్రంప్‌కు గిఫ్ట్‌ గా అందించారు. అలాగే ట్రంప్, మెలనియా దంపతులకు అధికారులు రాజ్‌ఘాట్ గురించి వివరించారు.

సమాధిని సందర్శించిన తర్వాత అమెరికా అధ్యక్షుడు అక్కడ ఉన్న సందర్శకుల పుస్తకంలో తన అభిప్రాయాన్ని రాసారు. ‘మహాత్ముడి ఆలోచనల నుంచి ఉద్భవించిన అద్భుతమైన భారత్‌ కు అమెరికా ప్రజలు ఎప్పుడూ అండగా ఉంటారు.. ఇది నాకు దక్కిన అద్భుతమైన గౌరవం’ అంటూ విజిటర్స్ బుక్ లో రాసి సంతకం చేశారు. అనంతరం మెలనియా కూడా సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. ఆ తరువాత అధికారులు మహాత్మా గాంధీ జ్ఞాపిక ను ట్రంప్ దంపతులకు అంద జేశారు. అనంతరం రాజ్ ఘాట్‌ లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొక్కను నాటారు. ఇకపొతే , సోమవారం సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించి, దాని విశిష్టతను తెలుసుకున్న ట్రంప్ దంపతులు, అక్కడ మహాత్మాగాంధీ వినియోగించిన చరఖా కూడా తిప్పి.. దాని వినియోగం అడిగి తెలుసుకున్న సంగతి తెలిసిందే.