Begin typing your search above and press return to search.

‘‘ఆనంది’’ చనిపోయిందని ఆమె చనిపోయింది

By:  Tupaki Desk   |   8 April 2016 5:01 AM GMT
‘‘ఆనంది’’ చనిపోయిందని ఆమె చనిపోయింది
X
చిన్నారి పెళ్లికూతురు ‘ఆనంది’ ఫేం ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య వార్త దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రత్యూష మరణవార్తను టీవీలో చూసిన ఆమె అభిమాని ఒకరు తీవ్రంగా కదిలిపోయారు. ఆమె మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్య చేసుకోవటం సంచలనంగా మారింది. ఆనంది అభిమాని ఆత్మహత్య వ్యవహారం చత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో చోటు చేసుకుంది. తీవ్ర విషాదాన్ని నింపిన ఈ వ్యవహారం వివరాల్లోకి వెళితే..

రాయ్ పూర్ లో మధు మహానంద్ అనే 22 ఏళ్ల మహిళ ప్రత్యూషకు అభిమాని. తాను ఎంతగానో అభిమానించే ప్రత్యూష సూసైడ్ చేసుకోవటాన్ని టీవీలో చూసింది. ఆమె మరణాన్నితట్టుకోలేక.. ఇంట్లోని ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషాదకరమైన అంశం ఏమిటంటే.. తల్లి ఆత్మహత్య చేసుకోవటాన్ని చూసిన రెండేళ్ల ఆమె కుమారుడు పెద్దగా ఏడవటంతో చుట్టుపక్కల వారు ఆమె ఆత్మహత్యను గుర్తించారు. గృహిణి ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఇంట్లో రెండేళ్ల కుమారుడు తప్పించి మరెవరూ లేరు.

ప్రత్యూష సూసైడ్ అంశం టీవీల్లో వార్తగా వచ్చిన సమయంలో.. ఉరి వేసుకుంటే ఎలా ఉంటుందని తన భార్య తనను అడిగిందని.. ఇప్పుడదే పనిని ఆమె చేయటంపై ఆమె భర్త విలపిస్తూ చెప్పుకొచ్చాడు. అభిమాని మరణం వేదనను కలిగించినా.. తనను నమ్ముకున్న చిన్న పిల్లాడి గురించి ఆలోచించటం మర్చిపోయి ఆత్మహత్య చేసుకోవటం ఎంతమాత్రం సరికాదు.