Begin typing your search above and press return to search.

అసద్ ట్రిపుల్ తలాక్ లో మోడీ మిస్

By:  Tupaki Desk   |   4 Feb 2017 4:21 PM GMT
అసద్ ట్రిపుల్ తలాక్ లో మోడీ మిస్
X
మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ తీరు గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. ఆయన మాట.. ఆయన వ్యవహారశైలి ఎంతటి వివాదాస్పదమో అందరికి తెలిసిందే. ఇలాంటి అసద్ కు ఎన్నికలు వస్తున్నాయంటే చాలు.. ఆయన మాట మరింత కరకుగా మారుతుంది. తాజాగా జరుగుతున్న ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో యూపీలో తన సత్తాను చాటాలని.. ఎలాగైనా అకౌంట్ తెరవాలని ఆయన తపిస్తున్నారు.

ఇందులో భాగంగా జోరుగా ప్రచారం చేస్తున్న అసద్.. తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సమాజ్ వాదీ.. కాంగ్రెస్.. బీఎస్పీలకు ఉత్తరప్రదేశ్ ప్రజలు ట్రిపుల్ తలాక్ పలకటం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. అసద్ ఏంటి? బీజేపీ పేరు ప్రస్తావించకుండా ఇంత పెద్ద మాట మాట్లాడటం ఏమిటన్న ఆలోచన అక్కర్లేదు. ఎందుకంటే.. ఆయన నోటి నుంచి ఆ మాట కూడా వచ్చేసింది.

ముఖ్యమైన మూడు పార్టీలతో పాటు బీజేపీపై కాస్తంత ప్రత్యేకంగా విమర్శలు చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. ప్రధాని మోడీలకు మధ్య తేడా ఏమీ లేదని.. వారిద్దరూ ఒకే నాణెనికి బొమ్మ.. బొరుసు లాంటోళ్లుగా అభివర్ణించారు. వీరిద్దరూ కలిసి అభివృద్ధి పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారన్న అసద్.. ములాయం.. రాజీవ్ లను ముస్లింలు నమ్మినట్లుగా వ్యాఖ్యానించారు.

అయితే.. వారిద్దరూముస్లింలను మోసం చేశారని.. వారు చేసిన అన్యాయం.. నిర్లక్ష్యం వల్లనే తామీ రోజు ప్రజల ముందుకు రావాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ఉగ్రవాద కేసుల్లో ఇరుక్కున్న ముస్లిం యువకులను విడిపిస్తామని సమాజ్ వాదీ పార్టీ హామీ ఇచ్చిందికానీ.. వారా విషయంలో ఏమీ చేయలేదన్నారు. అప్పుడెప్పుడో రాజీవ్ ముచ్చట చెబుతున్న అసద్.. ఆ తర్వాత సానియా డైరెక్షన్లో నడుస్తున్న కాంగ్రెస్ తో కలిసి చాలా కాలమే దోస్తానా చేశారు కదా? మరి.. అప్పుడు రాజీవ్ చేసిన ద్రోహం.. దుర్మార్గం గుర్తుకు రాలేదా అసద్ అన్న ప్రశ్నకు ఆయన సమాధానం చెబితే బాగుంటుందేమో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/