Begin typing your search above and press return to search.

యోగి రాజ్యంలో ఊహించ‌నంత ఆరాచ‌కం!

By:  Tupaki Desk   |   30 July 2019 2:13 PM IST
యోగి రాజ్యంలో ఊహించ‌నంత ఆరాచ‌కం!
X
అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే ఒక‌రు ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేశాడు. న్యాయం కోసం ఆమె పోరాటం మొద‌లెట్టింది. అంతే.. స‌ద‌రు ఎమ్మెల్యేకు కోపం వ‌చ్చింది కుటుంబ స‌భ్యుల్ని లేపేసే ప్రోగ్రాం పెట్టారు. అయినా వెన‌క‌డుగు వేయ‌లేదు. ధైర్యంతో పోరాడింది. చివ‌ర‌కు ఆమెను.. ఆమె లాయ‌ర్ నే కాదు.. ఆమెకు అండ‌గా నిలిచే వారంద‌రిని హోల్ సేల్ గా లేపేసేందుకు వెనుకాడ‌లేదు. ఇదంతా ఏ సినిమాలో సీన్ ఎంత‌మాత్రం కాదు.. నిత్యం నీతులు వ‌ల్లించే మోడీ మాష్టారి ప్రియ శిష్యుడు క‌మ్ యూపీ సీఎం యోగి ఆదిత్య‌నాథ్ రాజ్యంలో చోటుచేసుకున్న దురాగ‌తం.

ఇంత‌కీ.. స‌ద‌రు అమాయ‌కురాలిని అత్యాచారం చేసింది ఇంకెవ‌రో కాదు.. బీజేపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. ఉన్నావ్ ఉదంతంగా త‌రచూ మీడియాలో క‌నిపించే ఈ ఉదంతానికి సంబంధించి తాజా అప్డేట్ చూస్తే.. అన్యాయానికి వ్య‌తిరేకంగా పోరాడితే.. ఇంత భారీగా మూల్యం చెల్లించుకోవాలా? అన్న భావ‌న క‌లుగ‌క మాన‌దు.

దాదాపు రెండేళ్ల క్రితం యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే కుల‌దీప్ సింగ్ సెంగార్ ఉన్నావ్ కు చెందిన 17 ఏళ్ల మైన‌ర్ బాలిక‌ను దారుణంగా అత్యాచారం చేశారు. ఈ వ్య‌వ‌హారంలో ఆయ‌న‌పైనా.. ఆయ‌న సోద‌రుడితో స‌మా ప‌ది మందిపైన ఎఫ్ ఐఆర్ న‌మోదు చేశారు. మ‌రో 20 మంది పైనా హ‌త్య‌..హ‌త్యాయ‌త్నం.. నేర‌పూరిత కుట్ర వంటి అభియోగాల్ని మోపారు.

ఒక మైన‌ర్ బాలిక‌పై బీజేపీ ఎమ్మెల్యే ఒక‌రు అత్యాచారం చేయ‌టం దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మార‌ట‌మే కాదు.. ఉన్నావ్ ఉదంతంగా సంచ‌ల‌న‌మైంది. ఈ కేసుకు సంబంధించి గ‌త ఏడాది ఎమ్మెల్యే కుల‌దీప్ సింగ్ ను అరెస్ట్ చేసి జైలుకు త‌ర‌లించారు. బాధితురాలు త‌న‌కు జ‌రిగిన అన్యాయంపై పోరాడేందుకు చేసే ప్ర‌య‌త్నాల్ని ఎమ్మెల్యే అనుచ‌రులు దెబ్బ తీయ‌ట‌మే కాదు.. ఆమె మీద హ‌త్యాయ‌త్నాల‌కు పాల్ప‌డ్డారు.

ఆమె బంధువుల మీద త‌ప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు ఉన్నాయి. తాజాగా రాయ్ బ‌రేలీ జైల్లో ఉన్న త‌మ బంధువు మ‌హేష్ సింగ్ ను క‌లిసేందుకు ఉన్నావ్ అత్యాచార బాధితురాలు.. ఆమె పిన్ని.. మేన‌త్త‌.. న్యాయ‌వాదితో స‌హా ఆదివారం కారులో వెళుతున్నారు.ఇ దే స‌మ‌యంలో వారి కారును నెంబ‌రు ప్లేట్ లేని ట్ర‌క్కు ఢీ కొంది. ఈ ఘ‌ట‌న‌లో అత్యాచార బాధితురాలు తీవ్ర గాయాల‌తో ఆసుప‌త్రిలో చికిత్స పొందుతోంది. ఆమె ప‌రిస్థితి ఆందోళ‌న‌ర‌కంగా ఉంది. ఈ ఉదంతం మ‌రోసారి దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారింది.

ఎమ్మెల్యే మ‌నుషులే ఈ దారుణానికి పాల్ప‌డి ఉంటార‌న్న అనుమానాలు పెరిగాయి. ఇదిలా ఉంటే..తాజాగా ఈ వ్య‌వ‌హారంపై సీబీఐ విచార‌ణ‌ను జ‌రిపించాలంటూ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ప్ర‌తిపాద‌న‌లు పంపింది. ప్ర‌భుత్వం ఈ నిర్ణ‌యాన్ని తీసుకోవ‌టానికి ముందు ఆసుప‌త్రిలో తీవ్ర గాయాల‌తో ఉన్న స‌ద‌రు బాధితురాలు ఈ కేసును సీబీఐ విచార‌ణ జ‌రిపించాల‌ని డిమాండ్ చేశారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు చెబుతున్నారు. జ‌రుగుతున్న ప‌రిణామాల్ని చూస్తుంటే.. బాధితురాలిని.. ఆమె కుటుంబాన్ని ప్రాణాల‌తో వ‌దిలిపెట్టేలా లేర‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.