Begin typing your search above and press return to search.

ఏపీ ఆర్థిక పరిస్థితి పై కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్రమంత్రి

By:  Tupaki Desk   |   15 Dec 2021 7:37 AM IST
ఏపీ ఆర్థిక పరిస్థితి పై కీలక వ్యాఖ్యలు చేసిన  కేంద్రమంత్రి
X
ఆదాయాన్ని వాస్తవికంగా అంచనా వేయటంలో ఏపీ ప్రభుత్వం విఫలమైనట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్య చేశారు. ఏపీకి సంబంధించి మార్చి 31తో ముగిసిన 2020 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కాగ్ ఇచ్చిన నివేదికను చూసినప్పుడు ఏపీ సర్కారు వైఫల్యంపై ఆమె మొహమాటం లేకుండా మాట్లాడారు.

బీజేపీ ఎంపీ ఒకరు అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో సమాధానం ఇచ్చిన నిర్మలమ్మ.. ఏపీ సర్కారు తీరుపై సమాధానం ఇచ్చారు. 2015-16తో పోలిస్తే 2016-17 లో రెవెన్యూ లోటు పెరగటానికికారణం ఉదయ్ స్కీం మార్గదర్శకాల ప్రకారం డిస్కంల రుణాల్ని రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఖర్చు చేయటమేనని చెప్పారు.

రెవెన్యూ లోటును నియంత్రించకపోవటంతో పాటు 14వ ఆర్థిక సంఘం కాలావధి మొత్తంతో పాటు.. 15వ ఆర్థిక సంఘం పరిధిలోని 2020-21 లో రెవెన్యూ లోటు గ్రాంటు మంజూరు చేసినా.. ఏపీ రెవెన్యూ లోటు పెరుగుదల కనిపించినట్లుగా పేర్కొన్నారు. 2019-20లో ఏపీ రెవెన్యూ లోటు పెరగటానికి కారణం.. అక్కడి ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన అమ్మఒడి.. ఉచిత విద్యుత్తు లాంటి పథకాలేనని నిర్మలా చెప్పారు.

కేంద్రం అన్ని రాష్ట్రాలతో పాటు ఏపీకి వివిధ రూపాల్లో ఆర్థిక వనరులు అందిస్తున్నట్లు చెప్పిన ఆమె.. రాష్ట్ర విభజన తర్వాత 2014-15 నుంచి తాజా ఆర్థిక సంవత్సరం వరకు ఏపీకి పన్నుల వాటాలో భాగంగా రూ.4.40 లక్షల కోట్ల ఆర్థిక వనరుల్ని అందించినట్లుగా చెప్పారు.

విభజన నాటి నుంచి ఇప్పటివరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి బదిలీ అయిన ఆర్థిక వనరుల్ని చూస్తే.. పన్నుల్లో వాటా రూ.2,04,882 కోట్లు కాగా.. గ్రాంట్లు రూ.2,22,010 కోట్లు వచ్చాయి. రుణాలు.. అడ్వాన్స్ ల రూపంలో రూ.14,093 కోట్లు. మొత్తంగా రూ.4,40,985కోట్ల మొత్తం రాష్ట్రానికి వచ్చింది.