Begin typing your search above and press return to search.

భారత్ బంద్ కి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని మద్దతు .. !

By:  Tupaki Desk   |   8 Dec 2020 12:25 PM IST
భారత్ బంద్ కి తెలుగు రాష్ట్రాల్లో ఊహించని మద్దతు .. !
X
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా భారత్ బంద్‌ కొనసాగుతోంది. రైతు సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు దేశంలోని పలు రాష్ట్రాలు బంద్‌ పాటిస్తున్నాయి. ప్రతిపక్ష పార్టీలకార్యకర్తలు తెల్లవారుజామునుంచే రోడ్లపైకి వచ్చి దర్నాలు, ర్యాలీలు చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రైల్ రోకోలు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు చాలా చోట్ల డిపోలకు పరిమితమయ్యాయి. అత్యవసర సేవలకు అంతరాయం కలిగించకుండా శాంతియుతంగా ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్‌ సంపూర్ణంగా కొనసాగుతోంది.

ఇక , కొత్త వ్యవసాయ చట్టాన్ని వ్యతిరేకిస్తూ భారత్ బంద్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌కు రాజకీయ పార్టీలు, రాష్ట్రంలో అధికార పార్టీ టిఆర్ ఎస్ మద్దతు తెలపడంతో బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కరీంనగర్ ‌లో వేకువజామునే సీపీఐ, సీపీఎం నాయకులు కార్యకర్తలు బస్ స్టేషన్ వద్దకు చేరుకొని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. డిపో ముందు బస్ స్టేషన్ వద్ద బైఠాయించారు. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఇక రైతులకి మద్దతుగా గ్రేటర్ విశాఖ పరిధిలో బంద్‌ ప్రశాంతంగా జరుగుతోంది. నగరంలోని ద్వారక బస్ స్టేషన్‌కే ఆర్టీసీ బస్సులు పరిమితం అయ్యాయి. వ్యాపార సముదాయాలు, దుకాణాలు మూసివేసి స్వచ్చందంగా మూసివేసి మద్దతుగా నిలిచారు. వామపక్ష పార్టీలు నేతల నిరసన ర్యాలీ చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం బిల్లును వెనక్కి తీసుకునేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని ప్రజా సంఘాల నాయకులు హెచ్చరిస్తున్నారు.

ఇక భారత్ బంద్ లో భాగంగా శ్రీకాకుళం, టెక్కలి, పాలకొండ, పలాసలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముఖ్య కూడళ్లు, టోల్‌ప్లాజాల వద్ద పోలీసులను మోహరించారు.కర్నూలులో వామపక్షాలు పార్టీలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ కొనసాగుతోంది. జిల్లాలో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి. వ్యాపార, వాణిజ్య, విద్యా సంస్థలు బంద్‌కు స్వచ్చందంగా మూసివేశారు. ఢిల్లీ రైతులకు మద్దతు ఇస్తూ ప్రభుత్వ కార్యాలయాలు మధ్యాహ్నం వరకు మూసివేస్తున్నారు. హన్మకొండలో ఎడ్ల బండ్లతో రైతులు, టీఆర్‌ ఎస్‌ శ్రేణులు వినూత్న ర్యాలీ నిర్వహించారు. ఈ మేరకు కాజీపేట రైల్వేస్టేషన్‌ నుంచి హన్మకొండ బాలసముద్రంలోని ఏకశిల పార్కు వరకు చేపట్టిన ఈ ర్యాలీని చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌ భాస్కర్‌ ప్రారంభించి మాట్లాడారు. రైతాంగమంతా కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేస్తున్నా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టయినా లేదని ధ్వజమెత్తారు.

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రంపచోడవరంలోని సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్ మరియు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి నాయకులు రోడ్లపైకి చేరి రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలంటూ నినాదాలు చేస్తూ బంద్‌ను పాటిస్తున్నారు. సన్న వడ్లు కొనాలంటూ ధర్నాలు చేస్తున్న బీజేపీ నేతలు.. ముందు కేంద్రం జారీ చేసిన లేవీ సేకరణ చట్టాన్ని రద్దు చేసేలా చేయాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. ఏ రాష్ట్రమైనా కేంద్రం నిర్ణయించిన ధర కంటే ఒక్క రూపాయి ఎక్కువ ధర పెట్టినా లెవీ సేకరణ నిలిపివేస్తామని కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందన్నారు. చట్టాలు తెచ్చేది మీరే, ధరలు పెంచుతూ ధర్నాలు చేసేది మీరే అని ధ్వజమెత్తారు. భారత్ బందులో భాగంగా హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా రైతులు నిరసనకు దిగారు. చివ్వేంల మండలం గుంపుల తిరుమలగిరి వద్ద రైతులు ట్రాక్టర్లను రోడ్డుపై అడ్డంగా ఉంచి వ్యవసాయ చట్టాలకు వ్యతిరకేంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో హైవేపై ట్రాఫిక్‌ భారీగా స్తంభించి పోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది. రైతు సంఘాలు చేపట్టిన బంద్‌ కు బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపడంతో ఎక్కడికక్కడ అన్ని బంద్ అయ్యాయి. ఉదయాన్నే టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్‌ ను నిర్వహిస్తున్నారు.సికింద్రాబాద్, జేబీఎస్ బస్టాండ్ వద్ద బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. కంటోన్మెంట్, పికెట్ డిపోలో బస్సులు డిపో కే పరిమితమయ్యాయి. జేబీఎస్ బస్టాండ్ నిర్మానుష్యం గా మారింది. ప్రయాణికులు లేక బస్టాండ్ వెలవెలబోతోంది.

అనంతపురం జిల్లాలో వామపక్షాల ఆధ్వర్యంలో బంద్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఢిల్లీలో రైతుల దీక్షకు మద్దతుగా విద్యా, వ్యాపార సముదాయాలు మూసివేసి బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకోవాలని తలపెట్టిన భారత్ బంద్‌కు మద్దతుగా ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ తెలంగాణ అసోసియేషన్ ప్రతినిధుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. దేశవ్యాప్తంగా రైతుల నుంచి వస్తున్న వ్యతిరేకతను కేంద్ర ప్రభుత్వం అర్థం చేసుకొని ఆ చట్టాలను ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. రైతుల నిరసన చేస్తుంటే రాజకీయ పార్టీలపై నెడుతున్నారు. వ్యాపారస్తులు, అన్ని వర్గాల ప్రజలు బంద్‌కు సహకరించాలి. చట్టాలను వెనక్కి తీసుకోకపోతే ఆందోళన ఉధృతం అవుతుంది. పంటలకు గిట్టుబాటు ధర లేదు. తెలంగాణలో పండిన పంట దేశంలో వేరే చోట అమ్ముకోవాలంటే ఎలా. రైతులు ఇబ్బందులు పడుతున్నా పట్టదా. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో రైతాంగం కోలుకుంటోంది. ఎవర్ని పెంచి పోషించడం కోసం ఈ చట్టాలు. పంజాబ్, హరియాణలో నిరసనలు ఇంత ఉధృతంగా ఎందుకు జరుగుతుందో ఆలోచించాలి. టీఆర్ఎస్ ఓడిపోయింది కాబట్టి భయపడుతోందని అంటున్నారు. ఇలాంటి రాజకీయాలు, ఎన్నికలు మేం ఎన్ని చూడలేదు. అధికారం శాశ్వతం కాదు. నిజంగా సమస్య లేకపోతే కేంద్రం ఎందుకు చర్చలు జరుపుతుంది. ఇప్పటికైనా కేంద్రం దిగిరావాలి అని మంత్రి తలసాని అన్నారు.

భారత్ బంద్‌ లో భాగంగా లెనిన్ సెంటర్‌ లో రైతు, కార్మిక, విద్యార్థి, మహిళా సంఘాలు, వామపక్ష నేతల ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం చేపట్టారు. వ్యవసాయ పనిముట్ల తో మహిళా సంఘాల నేతలు నిరసన తెలుపుతున్నారు.