Begin typing your search above and press return to search.

కేంద్రం బ‌లుపు లెక్క ఏంటో చెప్పిన ఉండ‌వ‌ల్లి!

By:  Tupaki Desk   |   8 March 2018 10:15 AM IST
కేంద్రం బ‌లుపు లెక్క ఏంటో చెప్పిన ఉండ‌వ‌ల్లి!
X
మీరేం చేసుకున్నా ఫ‌ర్లేదు.. మేం మాత్రం మా స్టాండ్ మీదే ఉంటామ‌న్న‌ట్లుగా ఏపీకి ప్ర‌త్యేక హోదా మీద కేంద్రం తాను చెప్పాల్సింది క‌రాఖండిగా చెప్పేసింది. ఏపీ మీద సానుభూతి ఉంది.. అలా అని సానుభూతి ఉంద‌ని నిధులు అయితే ఇవ్వ‌లేం క‌దా? అంటూ కేంద్ర ఆర్థిక‌మంత్రి జైట్లీ మాష్టారి పొగ‌రు మాట ప్ర‌తి తెలుగోడికి గుండె ర‌గిలిపోయేలా చేసింది.

ఎంత బ‌లుపు కాకుంటే అంత చుల‌క‌న చేసి మాట్లాడ‌తారన్న భావ‌న తెలుగోళ్ల‌లో వ్య‌క్త‌మ‌వుతోంది. హోదా విష‌యంలో ఇప్ప‌టికే హ్యాండిచ్చిన మోడీ స‌ర్కారు.. తాజాగా ఈ విష‌యాన్ని తేల్చేసిన వైనం కొంద‌రికి ఆశ్చ‌ర్యానికి గురి చేస్తే.. మ‌రికొంద‌రికి షాకింగ్ గా మారింది. విభ‌జ‌న స‌మ‌యంలో కాంగ్రెస్ తీరును జీర్ణించుకోలేక‌పోయిన వారైతే.. తాజా ప‌రిణామాలపై భ‌గ్గుమంటున్నారు.

ఏపీ అంటే అంత చుల‌క‌నా? అని ప్ర‌శ్నిస్తున్నారు. విభ‌జ‌న నాడు కాంగ్రెస్ మీద ఎంత ఆగ్ర‌హం వ్య‌క్త‌మైందో.. అంత‌కు రెట్టింపు ఆగ్ర‌హం నేడు మోడీ అండ్ కో మీద వ్య‌క్త‌మ‌వుతోంది. కేంద్రం ఏపీని మ‌రోసారి దారుణంగా మోసం చేసింద‌న్న మండిపాటు ఆంధ్రోళ్ల‌లో వ్య‌క్త‌మ‌వుతోంది. ప్ర‌త్యేక హోదా వ‌స్తే పెట్టుబ‌డులు.. ప‌రిశ్ర‌మ‌లు.. ఉద్యోగాలు వ‌స్తాయ‌ని.. త‌ద్వార ఏపీ అభివృద్ధి చెందుతున్న భావ‌న ప్ర‌తిఒక్క‌రిలోనూ వ్య‌క్త‌మైంది. అందుకే.. హోదా మీద బోలెడ‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. తాజాగా జైట్లీ కుండ‌బ‌ద్ద‌లు కొట్టిన వైనంపై ఏపీ సీనియ‌ర్ నేత.. మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ స్పందించారు. జైట్లీ తీరును ఆయ‌న తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు.

హోదా విష‌యంలో కేంద్రం ఏపీ విన‌తుల్ని ప‌క్క‌న పెట్టేయ‌ట‌మే కాదు.. అవ‌హేళ‌న‌గా.. వెట‌కారంగా లెక్క‌లు చెప్ప‌టంపై తీవ్ర ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేశారు. కేంద్రానికి ఎందుకంత బ‌లుపన్న విష‌యాన్ని చెప్పుకొచ్చారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఏపీలో ఎవ‌రు గెలిచినా.. త‌మ‌కే మ‌ద్ద‌తు ఇవ్వాల్సి ఉంటుంద‌న్న ధైర్య‌మే వారి చేత ఇలా చేస్తుంద‌ని చెప్పారు. కాంగ్రెస్ ఉనికి లేని వేళ‌.. బీజేపీ మాత్ర‌మే దిక్కు అన్న‌ట్లుగా కేంద్ర వైఖ‌రి ఉంద‌ని.. అదే వారి చేత ఇలాంటి ప్ర‌క‌ట‌న‌లు చేసేలా చేస్తుంద‌న్నారు. ప్రాంతీయ పార్టీలు ఎవైనా స‌రే జాతీయ పార్టీల‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల్సిందేన‌న్న ఆలోచ‌న ఉంద‌న్నారు.