Begin typing your search above and press return to search.

మీడియా మొత్తం మిస్ అయిన పాయింట్ చెప్పి షాకిచ్చిన ఉండవల్లి

By:  Tupaki Desk   |   16 April 2022 8:30 AM GMT
మీడియా మొత్తం మిస్ అయిన పాయింట్ చెప్పి షాకిచ్చిన ఉండవల్లి
X
ఏదైనా సంఘటన జరిగినప్పుడు.. ఏదైనా పరిణామం చోటు చేసుకున్నప్పుడు.. ఆయా అంశాల్ని నిశితంగా పరిశీలించటం.. వాటి ప్రభావం రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండనుంది? ప్రజలకు జరిగే మేలు ఏమిటి? నష్టం ఏమిటి? లాంటి అంశాల్ని చెబుతుంటుంది మీడియా. ఒక రకంగా చెప్పాలంటే ముంచుకొచ్చే ప్రమాదాన్ని హెచ్చరించటంతో పాటు.. తప్పులు.. పొరపాట్లను ఎత్తి చూపి.. ప్రజలను చైతన్యవంతులుగా చేయటంలో మీడియా ముందుంటుంది. విషాదకరమైన అంశం ఏమంటే.. ఇలా చేయాల్సిన మీడియా సైతం.. ఇప్పుడు పలు అంశాల్ని పట్టించుకోవటం మానేసిందా? అన్న భావన కలిగేలా సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ వ్యాఖ్యలు ఉన్నాయి.

ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లటం.. ఆ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో భేటీ కావటం తెలిసిందే. తమ భేటీ సందర్భంగా ప్రధానికి ఏపీ సీఎం ఒక వినతిపత్రం ఇవ్వటం తెలిసిందే. అందులోని అంశాల్ని మీడియా కవర్ చేసినప్పటికీ.. అందులో ఉండాల్సిన ముఖ్యమైన అంశాలు కొన్ని మిస్ కావటం ఒక ఎత్తు అయితే.. వాటిని అటు రాజకీయ పక్షాలు కానీ.. ఇటు మీడియా కానీ ప్రస్తావించకపోవటం.. ప్రభుత్వాన్ని నిలదీయటం లాంటివి చేయకపోవటం విశేషం.

అలాంటి విషయాన్ని తాజాగా ప్రస్తావించిన మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ అందరికి షాకిచ్చారు. మీడియా భేటీని ఏర్పాటు చేసిన ఆయన.. ఏపీకి జరగనున్న అతి పెద్ద నష్టం గురించి హెచ్చరించారు. ఈ సందర్భంగా మీడియాకు సైతం ఆయన క్లాస్ పీకినంత పని చేశారు. తాను చెప్పే అంశాలపై మీడియా కూడా ప్రస్తావించకపోవటాన్ని వేలెత్తి చూపిన ఆయన తీరు చూసినప్పుడు సీఎం జగన్ తరచూ విరుచుకుపడే మీడియా సంస్థలు సైతం.. ఆయన చెప్పిన అంశాల్ని ఎలా మిస్ అయ్యారన్న సందేహం కలుగక మానదు.

ఇంతకూ ఉండవల్లి వెల్లడించిన కీలక అంశాన్ని ఆయన మాటల్లోనే చూస్తే.. ''ప్రధానమంత్రి మోడీని కలిసినప్పుడు సీఎం జగన్ లోపల ఏం మాట్లాడుకున్నారో నేను మాట్లాడటం లేదు. ఆయనకు ఇచ్చిన వినతిపత్రం గురించి మాట్లాడుతున్నా. స్పెషల్ కేటగిరి అని పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర నడిచిందే స్పెషల్ కేటగిరి మీద. సరే తీసేశారనుకుందాం. పోలవరం యాక్టులో ఉంది.

విభజన చట్టంలో పోలవరం మీద ఏం ఉన్నదో దాన్ని యథాతధంగా చేయండి. ఇంకేం అదనంగా వద్దు. అది కూడా అడగలేకపోతున్నారు. ఇంక మనల్ని ఎవరు ఆదుకుంటారండి? మన హక్కే మనం తెచ్చుకోలేకపోతే.. ఇంకేం చేస్తాం? పోలవరం మన హక్కు. స్పెషల్ కేటగిరి ఆబ్లిగేషన్. అది కూడా ఎవరు తెచ్చి పెట్టిందెవరు? జెట్లై.. వెంకయ్య నాయుడు. ఆ రోజున అందరూ లైవ్ చూశారు కదా. ఇద్దరు గొడవ గొడవ చేశారు.. ప్రత్యేక హోదా ఐదేళ్లు కాదు పదేళ్లు అని.

మేం వచ్చాక ఇస్తాం.. వచ్చేస్తున్నామన్నారు. అలానే వచ్చారు. మన్మోహన్ .. వెర్రిబాగోలేడు.. ఎన్నికల ఫలితాలు రావటానికి నెల రోజుల ముందే కేబినెట్ మీటింగ్ పెట్టి.. అందులో క్లియర్ గా పెట్టేశారు. ఇప్పుడున్న రేట్లతో పని జరగదు. పునరావాసంతో సహా.. మొత్తం కట్టించి ఆంధ్రప్రదేశ్ కు ప్రాజెక్టు కట్టించి అప్పజెప్పాలని స్పష్టంగా పేర్కొన్నారు. దాన్ని పక్కన పెట్టేశారు. గత కేబినెట్ ఆమోదించిన దాన్ని పక్కన పెట్టాలంటే దాన్ని ''ఆన్ డూ'' చేయాలి. కానీ.. అది చేయలేదు. అది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ అదేమీ ఫాలో కారు. అసలు ఇక్కడ ప్రొసీజరే ఉండదు'' అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్న హక్కుల్ని వదులుకునే ఏపీ ప్రజలు మాత్రమే కాదు.. వారిని చైతన్యం చేయాల్సిన మీడియా సైతం పట్టింపు లేకపోవటం దేనికి సంకేతం?