Begin typing your search above and press return to search.

దేశంలో మహమ్మారి అడుగుపెట్టి నేటికి రెండేళ్లు..!

By:  Tupaki Desk   |   30 Jan 2022 6:34 AM GMT
దేశంలో మహమ్మారి అడుగుపెట్టి నేటికి రెండేళ్లు..!
X
సరిగ్గా రెండేళ్ల కిందట కరోనా వైరస్ అంటే ఎవరికీ తెలియదు. భారత్ లో దాని ఆనవాలు లేదు. చైనాలో ఏదో ఓ వైరస్ పుట్టింది. అది చాలా మందికి సోకుతుంది అని పేపర్ చదివే జ్ఞానం ఉన్న వారికి మాత్రమే తెలుసు. కేవలం కొద్ది రోజుల్లోనే ఆ వైరస్ ఇతర దేశాలకు వ్యాపించిందని వార్తలు గుప్పుమన్నాయి. వీటికి భయపడుతున్న రోజుల్లోనే మన దేశంలో కూడా కరోనా వైరస్ తొలి కేసు నమోదైందని తెలిసింది. జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఒక్క కలవరపాటు. వైద్య అరోగ్య శాఖ అధికారుల్లో ఆందోళన. వైరస్.. వైరస్... ఆ మహమ్మారి ఎంత ప్రమాదకారి అనేది అప్పటికే చాలా మందికి తెలిసింది. ఇది అంతా జరిగింది సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజున. అవును కరోనా వైరస్ భారత్ లో అడుగు పెట్టి నేటికి సరిగ్గా రెండేళ్లు.

చైనాలో పుట్టిన ఈ కరోనా మహమ్మారి మన దేశంలో అడుగు పెట్టడానికి చాలా తక్కువ రోజులే పట్టింది. ఈ వైరస్ వ్యాప్తిని కనీసం చాలా దేశాలు అంచనా కూడా వేయలేదు. అందుకే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అత్యధిక జనాభా ఉన్న రెండో దేశం అయిన మన భారత్ లో అయితే ఈ వైరస్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుని కళ్లు తెరవడానికి కనీసం 50 రోజులకు పైనే పట్టింది. వరుసగా కేసులు ఒక్కొక్కటి నమోదు అవుతున్నాయని గమనించిన కేంద్ర ప్రభుత్వం ఒక్క సారిగా లాక్డౌన్ ప్రకటించింది. కానీ వైరస్ వ్యాప్తి మాత్రం ఆగలేదు. నేటికీ దాని ప్రభావం కొనసాగుతూనే ఉంది.

ఈ రెండేళ్లలో కరోనా వైరస్ రెండు వేరియంట్లతో మూడు వేవ్ లతో భారత్ పై విరుచుకుపడింది. మందులేక చాలా దేశాల్లో మోగిన మరణ మృదంగం.. భారత్ ను కూడా విడిచిపెట్టలేదు. వైరస్ కేసులు భారీగా నమోదు అయ్యి.. లక్షల మార్కుని తాకాయి. ఇలా చూస్తుండగానే వైరస్ వ్యాప్తి పెరిగి కోట్లకు చేరుకున్నాయి. ఈ క్రమంలోనే భారత్ లో పుట్టిన డెల్టా వేరియంట్ మన దేశంపై పగపట్టిందా? అన్నట్లుగా భారీగా కేసులు నమోదు అవ్వడమే గాక.. వైరస్ కారణంగా చనిపోయే వారి సంఖ్యను కూడా అమాంతం పెంచేసింది. ఎన్నో కుటుంబాల్లో పుట్టెడు దుఖాన్ని నింపింది. మరెన్నో కుటుంబాలకు పెద్ద దిక్కును లేకుండా చేసింది. ఎంతోమందికి తల్లిదండ్రులను దూరం చేసింది. మరికొన్ని చోట్ల అసలు కుటుంబమే లేకుండా చేసింది. ఇలాంటి వాటిని కళ్లముందే చూస్తూ గుండెను రాయి చేసుకున్నారు భారతీయులు. అంతేగాకుండా కరోనా కారణంగా వలస కార్మికులు రోడ్డున పడ్డారు.

ఈ రెండేళ్లలో కరోనా వైరస్ ప్రజల్లో చాలా మార్పులు తెచ్చింది. మూతికి మాస్కులు వచ్చాయి. ఇవి లేకుండా ఎవరూ బయటకు రావడం లేదు. బయటకు వచ్చేటప్పుడు బ్యాగుల్లో శానిటైజర్లు పెట్టుకుని వస్తున్నారు. ఇవేగాక ప్రతీ ఒక్కరికి ఆరోగ్యం పై శ్రద్ధ పెరిగింది. పరిశుభ్రత ఎక్కువైంది. వీటితో పాటు కరోనా వైరస్ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయ్యింది. ఇప్పటికీ కోలుకోలేదు అంటే ఆ ప్రభావం ఎంత ఉందనేది అర్థం చేసుకోవచ్చు. ఈ విధంగా రెండేళ్ల నుంచి మహమ్మారి దాడి దశలవారీగా కొనసాగుతూనే ఉంది.