Begin typing your search above and press return to search.

44 రోజుల్లోనే రెండువేల కోట్లు.. ఇవి అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలు..!

By:  Tupaki Desk   |   28 Feb 2021 4:16 PM IST
44 రోజుల్లోనే రెండువేల కోట్లు.. ఇవి అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలు..!
X
అయోధ్యలోని రామజన్మభూమిలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ఆధ్వర్యంలో రామాలయం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం జనవరి 15 నుంచి బీజేపీ, ఆర్​ఎస్​ఎస్​, విశ్వహిందూ పరిషత్​ తదితర సంస్థలు విరాళాలు సేకరించాయి. ఫిబ్రవరి 27 న విరాళాల సేకరణ ముగిసింది. కేవలం 44 రోజుల్లోనే దాదాపు రూ. 2 వేల కోట్ల విరాళాలు వచ్చినట్టు ట్రస్ట్​ వర్గాలు తెలిపాయి.

రూ. 2 వేల కోట్లతో రామాలయాన్ని నిర్మించాలని ట్రస్ట్​ భావించింది. ఈ మేరకు దేశంలోని ప్రజలందరినీ భాగస్వామ్యులను చేయాలనే ఉద్దేశ్యంతో విరాళాల సేకరణ చేపట్టారు. అయితే చాలా తక్కువ టైంలోనే విరాళాలు రావడం గమనార్హం. అయితే ఇంకా చాలా నగదును బ్యాంకుల్లో డిపాజిట్ చేయాల్సి ఉందని.. ట్రస్ట్​ నిర్వాహకులు అంటున్నారు. ఆ మొత్తాన్ని జమచేస్తే విరాళాలు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పారు.

విరాళాల ద్వారా అందిన మొత్తంపై ఆడిటింగ్ నిర్వహించాల్సి ఉందని ట్రస్టు కార్యాలయం ఇంచార్జి ప్రకాశ్ గుప్తా పేర్కొన్నారు. ఇందుకోసం ఓ యాప్ ను రూపొందించామన్నారు. విరాళాల సేకరణ ఎంతో పారదర్శకంగా చేపడుతున్నామని చెప్పారు.

విరాళాలపై వీహెచ్​పీ జాతీయ అధికార ప్రతినిధి వినోద్ బన్సాల్ మాట్లాడుతూ.. ‘శ్రీ రామ్ మందిర్ నిధి సమర్పన్ అభియాన్’ మకర సంక్రాంతి రోజున ప్రారంభించినట్టు చెప్పారు. మొత్తం ఐదు లక్షల గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లక్షలాది వలంటీర్ బృందాలు నిర్విరామంగా పనిచేశాయన్నారు. సేకరించిన విరాళాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా స్థానిక శాఖలలోని శ్రీ రామ్ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఖాతాల్లో జమచేస్తున్నామన్నారు.దేశం కోసం ధర్మం కోసం ప్రజలంతా ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారని చెప్పారు.