Begin typing your search above and press return to search.

దారుణం.. మనవళ్లను బలితీసుకున్న అమ్మమ్మ

By:  Tupaki Desk   |   25 Jun 2020 3:30 AM GMT
దారుణం.. మనవళ్లను బలితీసుకున్న అమ్మమ్మ
X
ఆ పిల్లలిద్దరూ తల్లిని కోల్పోయారు. తండ్రి మేస్త్రీ పని చేస్తాడు. లాక్ డౌన్ కారణంగా కొన్ని నెలలుగా స్కూళ్లు లేవు. నాన్న దగ్గర ఎన్ని రోజులు ఉంటాంలే అని అమ్మమ్మ ఇంటికి వెళ్లారా పిల్లలిద్దరూ. తర్వాత తమకు చికెన్ తినాలని ఉందని అమ్మమ్మను అడిగారు. ఆమె చికెన్ తెచ్చి వంట ఆరంభించింది. వంట అయ్యాక పిల్లలిద్దరికీ వడ్డించింది. తనూ తింది. కానీ చికెన్ తిన్న కాసేపటికే పిల్లిద్దరూ అపస్మారక స్థితికి వెళ్లిపోయారు. అందులో ఓ పిల్లాడు అక్కడిక్కడే చనిపోయాడు. మరో పిల్లాడు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో ప్రాణాలు విడిచాడు. ఆ పెద్దావిడ కూడా ఇప్పుడు చావుతో పోరాడుతోంది. చిత్తూరు జిల్లా గుడిపాల మండలం ఎఎల్‌పురంలో చోటు చేసుకున్న దారుణం ఇది. ఇంతకీ ఆ పిల్లలిద్దరి ప్రాణాలు పోవడాినికి కారణం ఏంటో తెలుసా? మతి స్థిమితం సరిగా లేని ఆ పెద్దావిడ చికెన్ మసాలా అనుకుని పురుగుల మందు ప్యాకెట్‌ను చికెన్‌లో వేయడమే.

ధనమ్మ, రాంబాబు అనే దంపతులకు రోహిత్‌ (12), జీవ (9) అనే ఇద్దరు కొడుకులున్నారు. అనారోగ్యం కారణంగా ధనమ్మ మూడేళ్ల కింద చనిపోయింది. రాంబాబు మేస్త్రీ పనులు చేస్తుంటాడు. ప్రస్తుతం పాఠశాల లేకపోవడంతో రోహిత్‌, జీవ ఇటీవలే గుడిపాల మండలం ఏఎల్‌పురంలోని అమ్మమ్మ గోవిందమ్మ ఇంటికొచ్చారు. వాళ్లిద్దరూ తాజాగా చికెన్‌ తినాలని అడగ్గా.. కొని తెచ్చి వంట ఆరంభించింది. గోవిందమ్మ. ఐతే చికెన్‌ మసాలా అనుకుని ఆమె గుళికల మందు వేసి వండింది. మధాహ్నం 3 గంటలకు ఆ కూరతో ముగ్గురూ భోజనం చేశారు. తిన్న వెంటనే జీవ అక్కడికక్కడే మరణించాడు. ఇది తెలుసుకున్న వెంటనే స్థానికులు రోహిత్‌ను, గోవిందమ్మను చిత్తూరులోని ప్రభుత్వాస్పత్రికి అంబులెన్సులో తీసుకెళ్లారు. మార్గమధ్యంలోనే రోహిత్‌ చనిపోగా.. గోవిందమ్మ పరిస్థితి విషమంగా మారింది. గోవిందమ్మకు మతిస్థిమితం సరిగా లేదని ఊరి వాళ్లు అంటున్నారు.