Begin typing your search above and press return to search.

ఒకేసారి రెండు డిగ్రీలు చదవొచ్చు..ఈ విద్యా సంవత్సరం నుండే అమల్లోకి .. !

By:  Tupaki Desk   |   8 July 2021 11:30 AM GMT
ఒకేసారి రెండు డిగ్రీలు చదవొచ్చు..ఈ విద్యా సంవత్సరం నుండే అమల్లోకి .. !
X
జవహర్‌ లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTU) డిగ్రీ విద్యలో సరికొత్త విధానాన్ని అమలల్లోకి తీసుకురావడానికి , దానికి తగ్గ ప్రణాళికల్ని సిద్ధం చేసింది. ఇప్పటిదాకా స్టూడెంట్స్ ఒకసారి ఒకే డిగ్రీని మాత్రమే చదివే అవకాశం ఉండగా ఇకపై ఒకేసారి రెండు డిగ్రీలు చదివేలా కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకురావడానికి అన్ని ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ ఏడాది నుండే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. దీని ప్రకారం ఇక నుంచి బీటెక్‌ విద్యార్థులు ఏకకాలంలో రెండు డిగ్రీలు పూర్తిచేయవచ్చు. సీటు వచ్చిన బ్రాంచిలో మేజర్‌ డిగ్రీతోపాటు విద్యార్థులకు నచ్చిన మరో కోర్సులో మైనర్‌ డిగ్రీని పూర్తిచేయవచ్చు. అయితే రెండూ ఒకేసారి రెగ్యులర్‌ కోర్సులుగా ఉండేందుకు అనుమతి ఉండదు. సాధారణ కళాశాల తరగతుల్లో రెగ్యులర్‌గా ఒక కోర్సు, మరొకటి ఆన్‌ లైన్ లో దూరవిద్య(ఓఎల్‌ డీ) ద్వారా చదువుకునే అవకాశం ఉంటుంది.

ఇకపోతే , 2020-21 విద్యాసంవత్సరంలోనే అఖిల భారత సాంకేతిక విద్యామండలి ఈ విధానాన్ని ప్రవేశపెట్టగా , కరోనా వైరస్ మహమ్మారి విజృంభణ తరుణంలో ఈ రెండు డిగ్రీల విధానాన్ని అమలు సాధ్యం కాలేదు. అయితే, ఇప్పటికే ఐఐటీల్లో ఈ డబుల్ డిగ్రీ విధానం అమల్లో ఉండగా ఈ విధానాన్ని అధ్యయనం చేసిన జేఎన్టీయూ అధికారులు ఆ నివేదికను సెనేట్‌ ముందుంచగా ఆమోదం తెలిపింది. ఈ విద్యాసంవత్సరం నుంచే ఈ డ్యూయల్‌ డిగ్రీ విధానాన్ని ప్రవేశపెట్టాలని జేఎన్టీయూ అకడమిక్‌ సెనేట్‌ సమావేశంలో తీర్మానించగా విధి విధానాలను రూపొందించేందుకు నిపుణుల కమిటీని నియమించనున్నారు. ఏక కాలంలో రెండు డిగ్రీ కోర్సుల ప్రతిపాదనలు 2012లోనే యూజీసీ ముందుకువచ్చింది.

ఈ ప్రతిపాదనను హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయం అప్పటి వైస్‌ చాన్స్‌ లర్‌ నేతృత్వంలో కమిటీ ద్వారా అధ్యయనం చేయించింది.రెగ్యులర్‌ విధానం కింద డిగ్రీలో చేరిన విద్యార్థి, అదే సమయంలో ఓపెన్‌ లేదా డిస్టెన్స్‌ విధానంలో గరిష్టంగా ఒక అదనపు డిగ్రీ చేయడానికి అనుమతించవచ్చని ఆ కమిటీ సిఫారసు చేసింది. రెగ్యులర్‌ మోడ్‌లో రెండు డిగ్రీలు ఒకేసారి అనుమతించడానికి పాలనా పరంగా వీలుకాదని అభిప్రాయపడింది. ప్రస్తుతం మారుతున్న ప్రపంచీకరణ, సరళీకరణ విధానాలు, పెరుగుతున్న పోటీతత్వంతో విద్యార్థులు వాటిని ఎదుర్కొనాలంటే మరింత పరిజ్ఞానం అవసరమని భావించి ఒకేసారి రెండు డిగ్రీలకు అవకాశం కల్పించింది. అలాగే బీటెక్‌లో సివిల్‌, మెకానికల్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రికల్‌ కోర్సులను కోర్‌ కోర్సులుగా వ్యవహరించే సంగతి తెలిసిందే కాగా అవి చాలా రోజుల ముందు ప్రవేశపెట్టిన ఈ కోర్సుల పట్ల విద్యార్థులు అంతగా ఆసక్తి చూపడంలేదు. అందుకే ఈ కోర్‌ గ్రూపుల్లో 70 వేలకు పైగా సీట్లు ఖాళీగా ఉంటున్నాయి. అయితే, ఇప్పుడున్న పరిస్థితులలో ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ గా పేరొందిన కంప్యూటర్‌ సైన్స్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ , మెకట్రానిక్స్‌ వంటి కోర్సుల పట్ల విద్యార్థులు ఆసక్తిచూపుతున్నారు. అందుకే కొర్ గ్రూపులకు ప్రత్యామ్నాయంగా డ్యూయల్‌ డిగ్రీలను ప్రవేశపెట్టాలని జే ఎన్ టి యు అధికారులు నిర్ణయించారు.