Begin typing your search above and press return to search.

ఐదుగురికి లైఫ్‌ ఇచ్చిన రెండున్నరేళ్ల బుడతడు

By:  Tupaki Desk   |   18 Dec 2020 2:00 PM IST
ఐదుగురికి లైఫ్‌ ఇచ్చిన రెండున్నరేళ్ల  బుడతడు
X
ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ఎదో ఒక రోజు ఈ జీవితానికి స్వస్తి చెప్పి వెళ్లిపోవాల్సిందే. కానీ, కొందరు తమ జీవితాన్ని ఆపేస్తూ , మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపి వెళ్ళిపోతారు. ఎన్నో కుటుంబాలకు ఆశాకిరణంగా మారతారు. అలాంటి వారిలో ఒకడు.. జాష్ ఓజా. ఈ చిన్నారి వయసు.. కేవలం రెండున్నరేళ్లు. రెండున్నరేళ్ళ వయసులోనే తాను చనిపోతూ ఐదుగురి ప్రాణాలను కాపాడాడు. ఒక జీవిని మనం మరణం నుంచి తప్పిస్తున్నామంటే.. దైవంతో సమానం. ఒక మనిషిని మరణం నుంచి తప్పించే అవయవ దానం అన్ని దానాల్లోకెల్ల గొప్పది. గుజరాత్‌కు చెందిన ఓ జంటకు ఈ విషయం బాగా తెలుసు. అందుకే తమను విడిచిపోయిన కుమారుడి అవయవాలు దానం చేసి.. మరి కొందరి ప్రాణాలు నిలిపి, వారిలో తమ బిడ్డను చూసుకుని కడుపు కోతను మర్చిపోతున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. గుజరాత్‌ కు చెందిన జర్నలిస్ట్‌ సంజీవ్‌ ఓజా దంపతులకు యష్‌ ఓజా అనే రెండున్నరేళ్ల ముద్దులొలికే కుమారుడు ఉన్నాడు. ఆడుతూ పాడుతూ సంతోషంగా ఎదుగుతున్న యష్‌ దురదృష్టవశాత్తు ఓ రోజు రెండో అంతస్తులో ఉన్న తన ఇంటి నుంచి కింద పడ్డాడు. దాంతో మెదడులో రక్తం గడ్డకట్టుకుపోయింది. చిన్నారి బ్రెయిన్‌ డెడ్‌ అయ్యాడని వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలో యష్‌ గురించి తెలుసుకున్న డోనేట్‌ లైఫ్‌ అనే ఎన్‌ జీఓ చిన్నారి తల్లిదండ్రులను కలుసుకుని.. వారి బిడ్డ అవయవాలు దానం చేసేలా వారిని ఒప్పించారు.

భౌతికంగా తమకు దూరమైన బిడ్డ, మరి కొందరికి ప్రాణం పోసి వారిలో జీవించి ఉంటాడని భావించిన తల్లిదండ్రులు తమ చిన్నారి అవయవాలు దానం చేయడానికి అంగీకరించారు. ఈ క్రమంలో యష్‌ గుండెని రష్యాకు చెందిన నాలుగేళ్ల చిన్నారికి.. ఊపిరితిత్తులను ఉక్రెయిన్‌కు చెందిన మరో చిన్నారికి.. అహ్మదాబాద్‌కు చెందిన ఇద్దరు అమ్మాయిలకు కిడ్నీలను.. భావ్‌నాగర్‌కు చెందిన మరో రెండేళ్ల చిన్నారికి యష్‌ లివర్‌ని అమర్చరారు. మరి కొద్ది రోజుల్లో మరణాన్ని చూడాల్సిన ఈ ఐదుగురు యష్‌ వల్ల తమ ఆయువును పెంచుకున్నారు. తమ బిడ్డ ఎక్కడికి పోలేదని , వారిలో ఉన్నాడు అంటూ భాదని దిగమింగుతూ చెప్తున్నారు.