Begin typing your search above and press return to search.

దిగి వ‌చ్చిన ట్విట్ట‌ర్‌.. కేంద్రం చెప్పిన ఖాతాల‌న్నీ బంద్‌?

By:  Tupaki Desk   |   12 Feb 2021 10:00 PM IST
దిగి వ‌చ్చిన ట్విట్ట‌ర్‌.. కేంద్రం చెప్పిన ఖాతాల‌న్నీ బంద్‌?
X
మోడీ ప్ర‌భుత్వం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన‌కు సోష‌ల్ మీడియాలోనూ మ‌ద్ద‌తు పెరుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో.. చాలా యాక్టివ్ గా ఉన్న ప‌లు అకౌంట్ల‌ను గుర్తించిన కేంద్రం.. వీటిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ట్విట్ట‌ర్ కు సూచించింది. అయితే.. ఆ ఖాతాల‌ను కొన్ని రోజులు నిలిపేసిన ట్విట్ట‌ర్.. ఆ త‌ర్వాత మ‌ళ్లీ పున‌రుద్ధ‌రించింది. ఈ విష‌యాన్ని కేంద్రం తీవ్రంగా ప‌రిగ‌ణించింది.

రైతుల ఉద్యమాన్ని పక్కదారి పట్టించేలా ట్వీట్లు చేస్తున్నారంటూ 1,178 ఖాతాలను గుర్తించిన కేంద్రం.. వాటిని నిలిపేయాల‌ని ఆదేశాలు జారీచేసింది. అయితే.. భావ ప్రకటన స్వేచ్ఛను అడ్డుకోలేమంటూ ట్విటర్ వాటిలో కొన్నింటిపై చర్య తీసుకోలేదు. కేంద్రం ఆగ్ర‌హించ‌డంతో తాజాగా అన్ని ఖాతాల‌పై చ‌ర్య తీసుకున్న‌ట్టు స‌మాచారం.

కేంద్రం ఫిర్యాదు చేసిన ఖాతాల్లో 97 శాతం అకౌంట్ల‌ను, వాటిల్లోని పోస్టులను బ్లాక్‌ చేసినట్లు స‌మాచారం. వివాదాస్పద ఖాతాలు, పోస్టులపై చర్యల విషయంలో బుధవారం కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ట్విటర్ ప్రతినిధుల మధ్య సమావేశం జరిగింది. ఈ సంద‌ర్భంగా భార‌త్ లో.. ఇక్క‌డి చ‌ట్టాల‌ను పాటించాల్సిందేనని స్ప‌ష్టం చేశారు. దీంతో.. ట్విట‌ర్ దిగివ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఈ విష‌యంపై ట్విటర్, కేంద్ర ప్రభుత్వాలు అధికారికంగా స్పందించాల్సి ఉంది.