Begin typing your search above and press return to search.

ఓటుకు నోటు కేసులో ట్విస్ట్.. రేవంత్ రెడ్డి హాజరు

By:  Tupaki Desk   |   13 Oct 2020 10:45 AM IST
ఓటుకు నోటు కేసులో ట్విస్ట్.. రేవంత్ రెడ్డి హాజరు
X
చాలా రోజులుగా స్తబ్దుగా ఉన్న ఓటుకు నోటు కేసులో కీలక ట్విస్ట్ నెలకొంది. మళ్లీ ఈ కేసు తెరపైకి వచ్చింది. తాజాగా ఏసీబీ కోర్టుకు కాంగ్రెస్ ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఆయనతోపాటు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహా కూడా కోర్టుకు హాజరయ్యారు.

ఓటుకు నోటు కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరి (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదిక, ఆడియో టేపులను ఏసీబీ అధికారులు కోర్టుకు సమర్పించారు. వాటిని ఏసీబీ కోర్టు పరిశీలించింది.

2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా నామినేట్ చేసిన ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ కు టీడీపీ-బీజేపీ అభ్యర్థిని గెలిపించాలంటూ రూ.50 లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి ‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ చేతిలో అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చాడు.

ఆ తర్వాత రేవంత్ రెడ్డి టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరాడు. కాంగ్రెస్ ఎంపీ అయ్యాడు. దాదాపు రెండేళ్లుగా స్తబ్దుగా ఉన్న కేసు తాజాగా మరోసారి విచారణకు వచ్చింది. దీంతో ఇవాళ కోర్టుకు రేవంత్ రెడ్డి సహా మిగతా వారు హాజరయ్యారు. సుప్రీం కోర్టు నేతలపై కేసుల విషయంలో విచారణ వేగవంతం చేయాలని కోరడంతో ఈ కేసు ఏమవుతుంది? రేవంత్ రెడ్డి భవితవ్యం ఏం తేలనుందనేది ఉత్కంఠ రేపుతోంది.