Begin typing your search above and press return to search.

మహనాడుకు ఊపు తెచ్చిన తెలంగాణ టీడీపీ నేత

By:  Tupaki Desk   |   29 May 2017 7:56 AM GMT
మహనాడుకు ఊపు తెచ్చిన తెలంగాణ టీడీపీ నేత
X
తెలుగుదేశం అధికారంలో ఉన్నా లేకున్నా ఆ పార్టీ నిర్వహించే మహానాడు అంటే గొప్పగా సాగుతుందనే భావన ఉండేది. కానీ... ఈసారి మహానాడు అత్యంత చప్పగా సాగుతోంది. ఎలక్ర్టానిక్, ప్రింట్ మీడియాలు ఈ మహానాడు నుంచి ఏం లీడ్ తీసుకుని వార్తలు రాయాలో తెలియనంత గందరగోళంలో ఉన్నాయంటే మహానాడు ఎంత రుచీపచీ లేకుండా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్ మొదలుకుని ప్రతి ఒక్కరూ కంటెంట్ లేని ప్రసంగాలతో మమ అనిపిస్తున్నారు. కానీ... ఓ తెలంగాణ టీడీపీ నేత ప్రసంగం మాత్రం అందరినీ కట్టిపడేసింది. ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీకి చెందిన కీలక నేతలు, మంత్రులు అంతా చల్లబడిపోయిన తరుణంలో తెలంగాణలో సోదిలో కూడా లేని తెలుగుదేశం పార్టీకి చెందిన నేత నర్సిరెడ్డి మాత్రం తన ప్రసంగంతో ఇరగదీశారు. ప్రాసలు, పంచ్ డైలాగులతో నర్సిరెడ్డి కేసీఆర్‌ కుటుంబంపై విరుచుకుపడ్డారు. మధ్యమధ్యలో పిట్టకథలు కూడా చెప్పి అచ్చం ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డిని తలపించారు.

మొన్నటి వరకు హైదరాబాద్‌ లో జ్యువెలరీ షాపులు, -కాంప్లెక్స్‌ల ప్రారంభోత్సవాల్లో సినిమా వాళ్లకు మంచి అవకాశాలుండేవని... ఇప్పుడు ఆ షాపుల ఓపెనింగ్‌ కూడా కేసీఆర్‌ కుటుంబసభ్యులే చేసేస్తున్నారని పరోక్షంగా ఎంపీ కవితపై సెటైర్లు వేశారు నర్సిరెడ్డి. రిబ్బన్‌ కటింగ్‌తో పాటు షాపు ఓనర్ జేబులను కూడా కటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా ఆయన చెప్పిన ఒక పిట్టకథ మహానాడులో అందరిలో ఊపు తెప్పించింది.

ఆయన చెప్పిన పిట్టకథ ఏంటంటే... ‘‘కేసీఆర్‌ తో సహా ఆరుగురు నేతలు రాష్ట్ర సాధన కోసం ప్రయాణమయ్యారు. భారీ వర్షం రావడంతో ఒకచోట చిక్కుకుపోయారు. వీరిని రక్షించేందుకు హెలికాప్టర్‌ వెళ్లింది. హెలికాప్టర్‌ నుంచి తాళ్లు వేసిన పైలట్‌ ఐదుగురిని మాత్రమే సురక్షితంగా ఒడ్డుకు చేర్చగలమని, ఎవరో ఒకరు తప్పుకోవాలని సూచించారు. తాళ్లు పట్టుకున్న వారంతా కేసీఆర్‌ వైపు చూస్తూ దూకేయమన్నారు. అయితే కేసీఆర్‌ మాత్రం నేను ఇంతగా తెలంగాణ కోసం పోరాటం చేశాను కదా… కాబట్టి నా కోసం మీరు ఏమీ చేయరా అని అడిగాడు. వారు ఏం చేయాలని అడిగితే…. కేసీఆర్‌ నన్ను అభినందిస్తూ అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి అన్నాడు. అంతే చప్పట్లు కొట్టి ఐరుగురు నీళ్లలో పడిపోయారు. కేసీఆర్‌ మాత్రం హెలికాప్టర్ ఎక్కి రాష్ట్రాన్ని ఏలుతున్నాడు” అని ఎద్దేవా చేశారు.

అలాగే ఆయన ఇంకో పిట్ట కథ కూడా చెప్పి మహానాడుకు కాస్త ఊపు తెచ్చారు. ‘‘ ఓ దంపతులు కాశీ వెళ్తారు... ఇంత దూరం వచ్చాం కదండి ఇష్టమైనది ఏదో ఒకటి వదిలేస్తే బాగుంటుందని చెప్తుంది అక్కడ భార్య.. అందుకు భర్త నాకు నీ కంటే ఇష్టమైనది ఏముందే పెళ్లామా అంటూ ఆమెను అక్కడే వదిలేశాడు. ఇప్పుడు కేసీఆర్‌ కూడా జేఏసీని అలాగే వదిలేశాడు” అని నర్సిరెడ్డి విమర్శించారు.

నర్సిరెడ్డి ప్రసంగం విన్న తరువాత మొత్తం టీడీపీలో ఒకటే చర్చ. పార్టీ మంచి మెజారిటీతో అధికారంలో ఉన్న ఏపీ టీడీపీ నేతలు ఇంత మొద్దుగా ఉన్నా కూడా ఏమీ లేని తెలంగాణకు చెందిన నేత బాగా మాట్లాడారాని ఆయనకు కితాబిస్తున్నారు. ఇప్పటివరకు మహానాడులో ప్రసంగించిన నేతల్లో నర్సిరెడ్డి తప్ప మిగతా అంతా తూతూ మంత్రంగా మాట్టాడారు. నర్సిరెడ్డి మాత్రం ఆకట్టుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/