Begin typing your search above and press return to search.

‘రాజీవ్ స్వగృహ’ ఆస్తులను వేలానికి పూనుకున్న ప్రభుత్వం

By:  Tupaki Desk   |   12 March 2020 5:30 PM GMT
‘రాజీవ్ స్వగృహ’ ఆస్తులను వేలానికి పూనుకున్న ప్రభుత్వం
X
ఉమ్మడి రాష్ట్రంలో 2008లో ప్రారంభమైన ‘రాజీవ్ స్వగృహా’ ఇళ్లకు త్వరలో మోక్షం లభించేలా కన్పిస్తోంది. తెలంగాణలో నిరర్థక ఆస్తులను విక్రయించి ఆదాయాన్ని పెంచుకోవాలని భావిస్తున్న తరుణంలో రాజీవ్ స్వగృహా ఆస్తుల వ్యవహారం తెరపైకి వచ్చింది. అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి హరీష్‌రావు రాజీవ్‌ స్వగృహ అంశాన్ని ప్రస్తావించారు. ఇటీవలే దీనిపై కేబినెట్‌ సమావేశంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.

రాజీవ్ సృగృహ ఇళ్లను ప్రభుత్వ ఉద్యోగులకు విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గృహనిర్మాణ శాఖకు ఇన్‌చార్జిగా ఉన్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ చిత్రా రామ చంద్రన్ నేతృత్వం లో విధివిధానాలను ఖరారు చేసేందుకు ముగ్గురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేసింది. ప్రతి ఇంటిని విడివిడిగా విక్రయించనుంది. వేలంలో ప్రభుత్వ ఉద్యోగులే కాకుండా ఎవరైనా పాల్గొనే అవకాశం కల్పించనుంది.

మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చడానికి నాటి ప్రభుత్వం రాజీవ్ సృగృహ పథకం చేపట్టింది. దీనిలో భాగంగా రంగారెడ్డి జిల్లా బండ్లగూడ, పోచారం లో 2008లో రెండు భారీ ప్రాజెక్టులను చేపట్టింది. 2011లో ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసింది. వీటి కోసం ప్రభుత్వం రూ.1,621.26కోట్లు ఖర్చు పెట్టింది. మార్కెట్ ధర కంటే ఇళ్లకు ఎక్కువగా ధర ఖరారు చేయడంతో కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు, వాటికైన వడ్డీతోసహా ప్రభుత్వం రూ.1,071.39 కోట్లు చెల్లించింది. 2017నుంచి ఈ ఇళ్ల సమస్య పెండింగ్లో ఉంది.

తాజా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ప్రభుత్వం ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు రాజీవ్ స్వగృహాలను వేలం వేయనుంది. ఉద్యోగులు కోరుతున్న రేట్లు, ప్రభుత్వం ప్రతిపాదించిన రేట్లపై పునరాలోచన చేసేందుకు తాజాగా కమిటీ ఏర్పాటు చేసింది. బండ్లగూడలో పూర్తయిన 309ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న 1,931ప్లాట్లు, పోచారం ప్రాజెక్టు లో అసంపూర్తి గా ఉన్న 954ప్లాట్లు, పూర్తయిన 1,650 ప్లాట్లను ఉద్యోగులకు కమిటీ నిర్ణయించిన విధంగా విక్రయించేందుకు సిద్ధమవుతుంది.

ఎట్టకేలకు రాజీవ్ స్వగృహా ఇళ్లు ఉద్యోగులు కోరుకుంటున్న తక్కువ ధరలకు ప్రభుత్వం విక్రయించేందుకు ముందుకు రావడంతో పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భలే చౌకగా ప్లాట్లు లభించే అవకాశం ఉండటం తో ఉద్యోగుల నుంచి పోటీ అధికంగా ఉండే అవకాశం కన్పిస్తుంది. ఏదిఏమైనా ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రాజీవ్ స్వగృహా సమస్యలు ఎట్టకేలకు పరిష్కారం కానుండటం ప్రభుత్వానికి కొంత ఊరట కలిగిస్తుంది.