Begin typing your search above and press return to search.

కరోనా కట్టడిలో ఇండియా కంటే మేమే మేలు..ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు

By:  Tupaki Desk   |   30 Sep 2020 5:35 PM GMT
కరోనా కట్టడిలో ఇండియా కంటే మేమే మేలు..ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు
X
అమెరికా అధ్యక్షుడు ట్రంప్​ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియాతో పోల్చుకుంటే అమెరికాలో ఎన్నోరెట్లు మెరుగ్గా కరోనాను కట్టడి చేశామని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సాయంత్రం తన తన ప్రత్యర్థి జో బైడెన్‌తో నిర్వహించిన చర్చా గోష్ఠిలో పాల్గొంటూ భారత్‌ దేశం ప్రస్తావన రెండుసార్లు తీసుకొచ్చారు. అయితే కరోనా కట్టడిలో ఇండియా ఫెయిల్​ అయ్యిందని చెప్పుకొచ్చారు. కరోనా మహమ్మారీని అరికట్టడంలో ట్రంప్‌ ప్రభుత్వం విఫలమైందని ప్రత్యర్థి జో బైడెన్‌ చేసిన ఆరోపణలకు సమాధానంగా ట్రంప్‌ మాట్లాడుతూ ‘ కరోనా బారిన పడి చైనాలో ఎంత మంది మరణించారో మనకు తెలియదు. అలాగే రష్యాలో ఎంత మంది మరణించారో కూడా తెలియదు. ఇక భారత్‌ విషయం కూడా అలాగే ఉంది. కరోనా మరణాల గురించి ఈ దేశాలు కచ్చితమైన సంఖ్యను వెల్లడించడం లేదు’ అని చెప్పారు.

జాన్స్‌ హాప్‌కిన్స్‌ యూనివర్శిటీ సర్వే ప్రకారం ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు అమెరికాలో నమోదుకాగా, ఆ తర్వాత స్థానంలో భారత్‌ ఉంది. ‘పారిస్‌ పర్యావరణ ఒప్పందం’ నుంచి 2017లో అమెరికా బయటకు రావడాన్ని ట్రంప్‌ సమర్థిస్తూ అలా చేయక పోయినట్లయితే దేశంలో పెద్దఎత్తున ఉద్యోగాలు కోల్పోయే వారమని అన్నారు.

మరోవైపు అమెరికాలో లాక్​డౌన్​ విధించకపోవడాన్ని కూడా ట్రంప్​ సమర్థించుకున్నారు. పర్యావరణంలో మార్పులు, వాతావరణ కాలుష్యం గురించి కూడా ట్రంప్ మాట్లాడుతూ చైనా, రష్యా, భారత్ లపై నిందలు వేశారు. ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ట్రంప్ ఈసారి ఈ మూడు దేశాలపై నోరు పారేసుకోవడం సంచలనంగా మారింది.