Begin typing your search above and press return to search.

జీ-7లో భారత్ కు చోటు...చైనాపై వేటు

By:  Tupaki Desk   |   1 Jun 2020 3:30 PM GMT
జీ-7లో భారత్ కు చోటు...చైనాపై వేటు
X
ప్రతి ఏటా నిర్వహించే జీ-7 సమావేశాలు ఈ సంవత్సరం కరోనా దెబ్బకు వాయిదా పడ్డాయి. వాస్తవానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జూన్ మొద‌టివారంలో అమెరికాలో జీ-7 సమావేశాలు జరపాలని నిర్ణయించారు. ఈ సారి సమావేశాలకు భార‌త్‌తోపాటు ర‌ష్యా, ఆస్ట్రేలియా, ద‌క్షిణ కొరియాల‌నూ ఈ స‌మావేశానికి ఆహ్వానిస్తామ‌ని ట్రంప్ చెప్పారు.ప్రస్తుత వ్య‌వ‌హారాలకు జీ-7 స‌మ‌ర్థంగా 7ప్రాతినిధ్యం వ‌హిస్తోంద‌ని ట్రంప్ భావించడం లేదు. తర్వాతి జీ-7 సమావేశాలు సెప్టెంబ‌రులో కానీ లేదా ఐక్య‌రాజ్య‌స‌మితి స‌ర్వ ప్ర‌తినిధి స‌భ స‌మావేశాలు పూర్తైన త‌ర్వాత కానీ లేదా అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌లు పూర్తైన త‌ర్వాత గానీ నిర్వ‌హించొచ్చని ట్రంప్ అన్నారు.

అయితే, జీ-7 దేశాల స‌ద‌స్సును జీ-10 లేదా జీ-11 స‌ద‌స్సుగా నిర్వహించాలని ట్రంప్ భావిస్తన్నారు. రష్యా, ద‌క్షిణ కొరియా, ఆస్ట్రేలియా, భార‌త్‌ల‌తో చ‌ర్చించారు. పాత షెడ్యూల్ ప్ర‌కారం..జూన్‌లో ఈ స‌ద‌స్సు జరగాలి. మెరీల్యాండ్‌లోని క్యాంప్ డేవిడ్‌ నుంచి ట్రంప్ ఈ సమావేశంలో పాల్గొనాలి. మిగ‌తా దేశాల నాయ‌కులు వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా ఈ స‌ద‌స్సుకు హాజరు కావాలి. అయితే, వైట్ హౌస్ లో ఈ స‌ద‌స్సు నిర్వ‌హిస్తామ‌ని, అన్ని దేశాల నాయ‌కులూ ఇక్క‌డ‌కు రావాల‌ని ఆహ్వానం పంపుతామ‌ని ట్రంప్ చెప్పారు. కానీ, ఈ పరిస్థితుల్లో అమెరికాకు వెళ్లేందుకు జ‌ర్మ‌నీ ఛాన్స్‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్ విముఖ‌త వ్య‌క్తం చేశారు. కరోనా విపత్తు సమయంలో వాషింగ్టన్ వెళ్లడం సరికాదని ఆమె అన్నారు. అంతా బాగుంటే ఫ్రాన్స్ అధ్య‌క్షుడు ఇమ్మానుయేల్ మెక్రాన్.. అమెరికా వెళ్లే అవ‌కాశ‌ముంద‌ని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.

అయితే, అత్యతం వేగంగా అభివృద్ధి చెందుతోన్నభారత్ కు జీ-10 లేదా జీ-11లో చోటుకల్పించాలని ట్రంప్ భావిస్తున్ానరు. కానీ, ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగివుండటంతో పాటు రెండో అతిపెద్ద ఆర్థిక శక్తిగా కూడా ఉన్న చైనాకు మాత్రం ఇందులో చోటు దక్కలేదు. జనాభా, తలసరి సంపద మిగతా అభివృద్ధి చెందిన దేశాలకన్నా తక్కువ స్థాయిలో ఉండటం వల్ల చైనాను పరిగణించలేదని తెలుస్తోంది. ఆ లెక్కన భారత్ కూ జీ-10 లేదా 11లో చోటుండకూడదు. కానీ, కరోనా నేపథ్యంలో చైనాను ట్రంప్ పక్కనబెట్టారని టాక్ వస్తోంది. చైనీస్ వైరస్ అంటూ చైనా పై ట్రంప్ కారాలు మిరియాలు నూరుతున్నారు. అందుకే, చైనాను ట్రంప్ దూరం పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే.. మరింత విస్తృతమైన జీ20 దేశాల బృందంలో చైనా ఉంది. భవిష్యత్తులో జీ-20 నుంచి కూడా చైనాను ట్రంప్ తొలగిస్తారేమో చూడాలి. ఇప్పటికే చైనాపై చాలా ప్రపంచ దేశాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో జీ-20 నుంచి చైనాను తొలగించినా ఆశ్చర్యం లేదు.