Begin typing your search above and press return to search.

గులాబీకి గుడ్ న్యూస్‌!..ఆ రెండు గుర్తులు గాయ‌బ్‌!

By:  Tupaki Desk   |   26 Feb 2019 1:53 PM GMT
గులాబీకి గుడ్ న్యూస్‌!..ఆ రెండు గుర్తులు గాయ‌బ్‌!
X
నిజంగా గులాబీ పార్టీ టీఆర్ ఎస్‌ కు ఇది గుడ్ న్యూసే. ఎందుకంటే... గ‌డ‌చిన ఎన్నిక‌ల్లో ఆ పార్టీ ప్ర‌మేయం లేకుండానే ఇత‌ర పార్టీలు - అభ్య‌ర్థుల‌కు వెళ్లిపోయిన‌ ఓట్లు ఇక‌పై ఎంత‌మాత్రం మిస్ కావు. ఈ మేర‌కు టీఆర్ ఎస్‌ కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం గుడ్ న్యూస్‌ ను వినిపించింది. ఆ గుడ్ న్యూస్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... టీఆర్ ఎస్ ఎన్నిక‌ల గుర్తు కారును పోలిన ట్ర‌క్కు - ఇస్త్రీ పెట్టెల‌ను పార్టీ గుర్తుల నుంచి ఈసీ తొల‌గించేసింది. ఈ మేర‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది. ఈ నిర్ణ‌యం మేర‌కు ఇప్ప‌టికిప్పుడు ఈ రెండు గుర్తులు ఎన్నిక‌ల గుర్తుల జాబితా నుంచి మాయం కానున్నాయి. ఈ రెండు గుర్తులు వ‌ద్దంటూ టీఆర్ ఎస్సే కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి విన్న‌వించిన విషయం తెలిసిందే.

ఈ క‌థాక‌మామీషు ఏమిట‌న్న విషయానికి వ‌స్తే... ఇటీవ‌ల జ‌రిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వంద‌కు పైగా సీట్లు గెలుస్తామ‌ని టీఆర్ ఎస్ అధినేత క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే క‌దా. రాష్ట్రం మొత్తం స‌ర్వే చేయించుకుని - త‌న ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన ప‌థ‌కాలతోనే ఈ త‌ర‌హా భారీ విన్ సాధ్య‌మ‌ని కేసీఆర్ లెక్క‌లేశారు. అయితే 88 సీట్లు మాత్ర‌మే టీఆర్ ఎస్ ఖాతాలో ప‌డ్డాయి. ఈ క్ర‌మంలో ఎక్క‌డ త‌మ అంచ‌నా బెడిసికొట్టింద‌న్న దిశ‌గా ఆలోచన చేసిన కేసీఆర్‌.. కారు గుర్తును పోలి ఉన్న ట్ర‌క్కు - ఇస్త్రీ పెట్టె గుర్తులు త‌మ కొంప ముంచాయ‌ని ఓ అంచ‌నాకు వ‌చ్చారు. ఈ దిశ‌గా మరింత లోతుగా ఆలోచ‌న చేయ‌గా... ఈ విష‌యం వాస్త‌వ‌మేన‌ని తేలింది. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ట్ర‌క్కు - ఇస్త్రీ పెట్టె గుర్తులు ద‌క్కిన అభ్య‌ర్థుల‌కు వారి వాస్త‌వ బ‌లం కంటే అధికంగా ఓట్లు ప‌డ్డాయి.

దీంతో మ‌రి కాస్త లోతుగా విశ్లేషించ‌గా... కొన్ని ప్రాంతాల్లోని ఓట‌ర్లు తాము టీఆర్ ఎస్‌ కే ఓటేయాల‌ని పోలింగ్ బూతుల‌కు వ‌చ్చినా.. కారు గుర్తుతో పాటు అదే జాబితాలో దానిని పోలిన ట్ర‌క్కు - ఇస్త్రీ పెట్టె గుర్తులు కూడా ఉండ‌టంతో... వాటిలో టీఆర్ ఎస్ గుర్తు అయిన కారు ఏద‌న్న విష‌యాన్ని నిర్ధారించుకోలేక కొంద‌రు ట్ర‌క్కు, మ‌రికొంద‌రు ఇస్త్రీ పెట్టెల‌కు ఓటేసి వెళ్లిపోయారు. ఈ కార‌ణంగానే ప్ర‌జ‌ల్లో అంత‌గా బ‌లం లేని నేత‌లు కేవ‌లం ట్ర‌క్కు - ఇస్త్రీ పెట్టెల గుర్తుల‌తో త‌మ స్థాయికి మించి ఓట్ల‌ను సంపాదించుకోగ‌లిగారు. ఈ విష‌యాన్ని నిర్ధార‌ణ చేసుకున్న టీఆర్ ఎస్ త‌మ ఓట్ల‌ను లాగేసుకుంటున్న ట్ర‌క్కు - ఇస్త్రీ పెట్టె గుర్తుల‌ను జాబితా నుంచి తొల‌గించాల‌ని అభ్య‌ర్థించింది. ఈ అభ్య‌ర్థ‌న‌ను ప‌రిశీలించిన ఈసీ... ఆ రెండు గుర్తుల‌ను ఎల‌క్ష‌న్ సింబ‌ల్స్ నుంచి తొల‌గించేసింది. మ‌రి త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న పార్ల‌మెంటు ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్ ఏ మేర‌కు త‌న మెజారిటీని పెంచుకుంటుంద‌న్న విష‌యంపై ఇప్పుడు స‌రికొత్త చ‌ర్చ‌కు తెర లేసింది.