Begin typing your search above and press return to search.

మునుగోడు టీఆర్ఎస్ దే.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్

By:  Tupaki Desk   |   6 Nov 2022 11:49 AM GMT
మునుగోడు టీఆర్ఎస్ దే.. డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్
X
మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ స్పష్టమైన ఆధిక్యతతో గెలిచేసింది. 13వ రౌండ్ వచ్చేసరికే ఏకంగా 9వేల ఓట్ల ఆధిక్యంతో టీఆర్ఎస్ దూసుకెళ్లింది.దీంతో మునుగోడు టీఆర్ఎస్ దేనని అర్థమవుతోంది. టీఆర్ఎస్ అధికార దుర్వినియోగం చేసి గెలిచిందని బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కనీసం ప్రచారం చేసుకోనివ్వలేదన్నారు. టీఆర్ఎస్ ది అధర్మ గెలుపు అన్నారు.

ఇక టీఆర్ఎస్, బీజేపీ మునుగోడులో హోరాహోరీగా తలపడగా.. కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చవిచూసింది. కనీసం డిపాజిట్ తెచ్చుకోలేకపోయింది. 12 రౌండ్లు పూర్తయ్యేసరికి 19415 ఓట్లు మాత్రమే సాధించింది. డిపాజిట్ దక్కించుకోవాలంటే పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు సాధించాలి.

కానీ కాంగ్రెస్ డిపాజిట్ మార్కును అందుకోలేకపోయింది. 2018 నుంచి జరిగిన ఏ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటలేకపోయింది.

మునుగోడులో మొత్తం 2,41,805 మంది ఓటర్లకు గాను 2,25,192 మంది ఓటు వేశారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది.

కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతికి టికెట్ ఇచ్చారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. నియోజకవర్గంలో ఆమెకు స్పందన కరువైంది. నేతల మద్దతు కూడా పెద్దగా దక్కలేదు. మునుగోడు ఉప ఎన్నికల్లో 93 శాతం ఓట్లు పడినా కాంగ్రెస్ కు డిపాజిట్ దక్కకపోవడం గమనార్హం.