Begin typing your search above and press return to search.

తెలంగాణ ఎన్నికలు.. బాబే టార్గెట్

By:  Tupaki Desk   |   9 Nov 2018 2:30 PM GMT
తెలంగాణ ఎన్నికలు.. బాబే టార్గెట్
X
చంద్రబాబును తిడితే మొత్తం సీమాంధ్రులు బాధపడుతారా.? టీఆర్ఎస్ పార్టీకి దూరమవుతారా.? బాబు అరాచకాలు.. అక్రమ పొత్తులను, అవినీతిని ప్రశ్నిస్తే సీమాంధ్ర ఓట్లు గులాబీ పార్టీకి పడవా అన్న ప్రశ్నలకు టీఆర్ఎస్ కు సమాధానం దొరికింది. తాజాగా కేసీఆర్ అండ్ టీం తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు అత్యధికంగా ఉన్న ప్రాంతాల నుంచి స్వయంగా ఫీడ్ బ్యాక్ తెప్పించుకుందట.. స్థానిక పార్టీ నేతలు - అభ్యర్థులు ఇతర సామాజిక వర్గాల మనోగతాన్ని తెలుసుకున్నారు. ఇదంతా బేరీజు వేసుకొని చంద్రబాబును టార్గెట్ చేసి తూర్పార పట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు..

ఏపీ సీఎం చంద్రబాబు మహాకూటమిలో భాగస్వామి అయ్యి తెలంగాణ రాజకీయాల్లో పెత్తనం చెలాయించాలని స్కెచ్ గీశాడు. ఆంధ్రా పార్టీ అధిపతి అయిన బాబు.. తెలంగాణలో చక్రం తిప్పాలని చూడడాన్ని టీఆర్ ఎస్ తీవ్రంగా ఆక్షేపించిది. దీంతో బాబు ను టార్గెట్ చేసి పరుష విమర్శలు చేసింది. కానీ దీన్ని తెలంగాణలోని సీమాంధ్ర ఓటర్లు వ్యతిరేకిస్తున్నారని.. గులాబీ పార్టీకి దూరమవుతున్నారని ప్రచారం జరిగింది.

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ సీమాంధ్రులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే చేయించారు. ఇందులో చంద్రబాబు విషయంలో ఉత్తరాంధ్ర - రాయలసీమ ప్రాంత వాసుల్లో మెజారిటీ సానుకూలంగా లేరని.. కోస్తా - ఆంద్రా ప్రాంతాల్లోనూ భిన్నాభిప్రాలున్నట్లు తేటతెల్లమైందట.. దీంతో రెండు మూడు రోజులుగా టీఆర్ ఎస్ నాయకులు తిరిగి చంద్రబాబుపై విమర్శలకు దిగుతున్నారు. నిన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. చంద్రబాబును తిడితే సీమాంధ్రులు నొచ్చుకోవడం లేదని.. టీఆర్ ఎస్ కు దూరం కావడం లేదని తేలింది. దీన్ని బట్టి బాబుకు ఏపీలోనే కాదు.. తెలంగాణలోని సీమాంధ్రుల్లో కూడా వ్యతిరేకత ఉన్నట్టు అర్థమవుతోంది.