Begin typing your search above and press return to search.

టీఆర్ ఎస్ ఫిర్యాదుతో బాబు మైండ్ బ్లాంకేనా?

By:  Tupaki Desk   |   19 Nov 2018 6:06 AM GMT
టీఆర్ ఎస్ ఫిర్యాదుతో బాబు మైండ్ బ్లాంకేనా?
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడుకు ఉన్న ప్ర‌చార యావ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కోకొల్ల‌లుగా ఉదాహ‌ర‌ణాల‌ను ఆయా వర్గాలు పేర్కొంటాయి. ప్ర‌చారానికి ఏ అంశాన్నైనా బాబు గారు వాడేసుకుంటార‌నే విష‌యం గురించి ప్ర‌స్తావించేందుకు...ఆయ‌న ప్ర‌చారం పీక్స్ ఎలా ఉంటుందో చెప్పేందుకు తాజా ఉదాహ‌ర‌ణ ఉత్త‌రాంధ్ర‌ను అత‌లాకుత‌లం చేసిన తిత్లీ తుఫాన్‌. తుఫాను స‌మ‌యంలో ఏ స‌ర్కారైనా స‌హాయ‌క చ‌ర్య‌లు చేస్తుంది. చేయ‌డం బాధ్య‌త కూడా. అయితే, దాన్ని కూడా ప్ర‌చారానికి వాడుకున్నారు. ఏకంగా ఆర్టీసీ బ‌స్సుల‌పై ప్ర‌చారం చేస్తూ...మేం ఇది చేసేశాం అంటూ...ఊద‌ర‌గొట్టారు. ఈ ప్ర‌చారాన్ని చూసి ఎంద‌రో ముక్కున వేలేసుకున్నారు.

అయితే, తాజాగా తెలంగాణ‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్న సంద‌ర్భంగా బాబు ప్ర‌చారం తీరుపై టీఆర్ ఎస్ పార్టీ టార్గెట్ చేసింది. ఏపీ సీఎం చంద్రబాబు ప్రభుత్వ పథకాల ప్రకటనలను తెలంగాణలో ప్రసారం చేయించడం ఎందుకని టీఆర్ ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్ ప్రశ్నించారు. అదనపు ఎన్నికల ప్రధానాధికారి జ్యోతి బుద్ధప్రకాశ్‌ ను కలిసి ఎంపీ బోయినపల్లి వినోద్‌ కుమార్ - ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి ఫిర్యాదుచేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. టీవీ చానళ్లలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలను చంద్రబాబు ఇష్టానుసారంగా ప్రసారం చేయిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై కేంద్ర ఎన్నికల కమిషన్‌ కు కూడా ఫిర్యాదుచేస్తామని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు పార్టీ పరంగా ప్రకటనలు చేసుకొంటే అభ్యంత‌రంలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇక్కడ లేనప్పటికీ ప్రభుత్వ సొమ్ముతో చంద్రబాబు ప్రకటనలు ఇస్తున్నారని, తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కూడా పోటీలో ఉన్నందున ఆయన ప్రకటనలు ఓటర్లను ప్రభావితం చేస్తాయన్నారు. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ప్రకటనలను తెలంగాణలో ప్రసారం చేయడాన్ని వెంటనే ఆపాలని ఎన్నికల సంఘాన్ని కోరారు.