Begin typing your search above and press return to search.

బంద్ వేళ.. గులాబీ బ్యాచ్ దాడులు చేసుడేంది?

By:  Tupaki Desk   |   9 Dec 2020 11:22 AM IST
బంద్ వేళ.. గులాబీ బ్యాచ్ దాడులు చేసుడేంది?
X
రైతులకు మద్దతుగా మంగళవారం దేశ వ్యాప్తంగా భారత్ బంద్ కు పిలుపునివ్వటం తెలిసిందే. సాధారణంగా.. బంద్ లు..ధర్నాలు.. నిరసనలు లాంటివి తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అస్సలు నచ్చవు. ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎవరైనా నిరసనలు.. ఆందోళనలు అంటే.. రెండు రోజుల ముందు నుంచే సదరు నేతల్ని హౌస్ అరెస్టు చేయటం.. అదుపులోకి తీసుకోవటం లాంటివి కామన్ అయ్యాయి. ఇక.. ఉద్యమనేతలు ఎక్కడైనా ఆందోళన చేసేందుకు వెళుతుంటే.. దారి మధ్యలో వారిని అడ్డగించి అదుపులోకి తీసుకోవటం తెలంగాణ పోలీసులకు అలవాటైన పని. ఇలా కేసీఆర్ హయాంలో ఆందోళనలకు కొత్త భాష్యం చెప్పిన ఆయన.. తాజాగా భారత్ బంద్ కు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ప్రకటించారు.

అంతేకాదు.. పార్టీ నేతలు.. ప్రజాప్రతినిధులు.. కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేయాలని.. ధర్నాలు చేపట్టాలని.. బంద్ ను విజయవంతం చేయాలన్నారు. దీనికి తగ్గట్లే ఉద్యమ సమయంలోనూ ధర్నాల్లో పెద్దగా పాల్గొనని మంత్రి కేటీఆర్ తాజాగా రోడ్డు మీద బైఠాయిస్తే.. మంత్రి హరీశ్.. ఎమ్మెల్సీ కవిత ఇలా అందరూ రోడ్ల మీదకు వచ్చారు. పార్టీ అగ్రనాయకత్వం ఇంత జోరుగా రోడ్ల మీదకు వచ్చినప్పుడు గులాబీ దండు మరెంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే ఉండదు.

దీనికి తగ్గట్లే గులాబీ దళం చెలరేగిపోయారు. తాము బంద్ కు పిలుపునిస్తే.. కొందరు వినకుండా షాపులు తెరవటాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. అంతే.. షాపుల మీద దాడులు చేసేందుకు వెనుకాడలేదు. హైదరాబాద్ లోనే మూడు.. నాలుగు ఉదంతాలు చోటుచేసుకున్నట్లు చెబుతున్నారు. మలక్ పేటలోనూ.. ముషీరాబాద్ లోని వాణిజ్య సంస్థలపై దాడి చేయటం.. సామాన్లను ధ్వంసం చేసిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ధర్నాలు.. బంద్ లకు వ్యతిరేకమైన తెలంగాణ అధికారపార్టీ.. చేయక చేయక ఒక బంద్ చేస్తే.. మరీ ఇంత రచ్చ చేయటమా? అని ఆశ్చర్యానికి గురవుతున్నారు.