Begin typing your search above and press return to search.

గులాబీ గుబులు: పాడు వర్షం.. ‘వంద’కు దెబ్బేనా?

By:  Tupaki Desk   |   15 Oct 2020 4:00 PM GMT
గులాబీ గుబులు: పాడు వర్షం.. ‘వంద’కు దెబ్బేనా?
X
అప్పటివరకు అంతా అనుకున్నట్లే జరుగుతుంది. కుస్తీలు పట్టి.. పక్కగా రాసుకున్న స్క్రిప్టు కూడా అంత బాగా రాదన్నట్లుగా.. ఏం అనుకుంటే అలా జరిగిపోతున్న వేళ.. అధికారపక్షంలో ఉండే వారికి వచ్చే ఆత్మవిశ్వాసం అంతా ఇంతా కాదు. అలాంటివేళలో.. చిన్నపాటి ఎదురుదెబ్బ కూడా విపరీతమైన నొప్పిని కలిగిస్తుంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే గులాబీ దళానికి ఎదురైందని చెబుతున్నారు. తమ బిగ్ బాస్ టేకప్ చేసిన ఏ ఇష్యూ అయినా సరే అంతిమంగా తమకు అనుకూలంగా మారే అవకాశం ఉండటం.. ఎన్నిక ఏదైనా విజయం తమనే వరిస్తుందన్న ధీమాను టీఆర్ఎస్ నేతలు తరచూ వ్యక్తం చేస్తుంటారు.

అందుకు తగ్గట్లే ఫలితాలు రావటంతో.. కేసీఆర్ మాస్టర్ మైండ్ మీద అంచనాలు అంతకంతకూ పెరిగిపోయే పరిస్థితి. మొన్నటికి మొన్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 90 శాతం ఓట్లతో కవిత సాధించిన ఘన విజయం తాలూకు ఆనందాన్ని అస్వాదిస్తున్న వేళ.. అనుకోని అతిధిలా వచ్చి పడిన పాడు వాన.. గులాబీ బాస్ కలల్ని కల్లలు చేయనుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.

తాను చేయించిన సర్వేల ప్రకారం వందకు పైగా కార్పొరేషన్ సీట్లు ఖాయమని చెప్పటమే కాదు.. అదెలా అన్న వారికి లెక్కలతో సహా వివరిస్తున్న పరిస్థితి. అన్ని బాగుంటే.. 105 సీట్లకు పైనే సొంతం చేసుకుంటామని.. అదే జరిగితే.. తిరుగులేని రికార్డు ఒకటి తమ వశం అవుతుందని.. రాబోయే రోజుల్లో ఇలాంటి రికార్డు సాధ్యం కాదని గులాబీ నేతల నోటి నుంచి ధీమాగా వినిపించే పరిస్థితి. ఇలా ధీమా..ఆత్మవిశ్వాసం తాజాగా కురిసిన భారీ వర్షంతో కొట్టుకు పోయినట్లుగా చెప్పక తప్పదు.

ఎప్పుడూ కూల్ గా ఉండే.. మంత్రి కేటీఆర్ నిన్నటి రోజున చిరాగ్గా ఉన్నట్లు చెబుతున్నారు. చివరకు కార్పొరేటర్లకు సైతం ఆయన క్లాస్ పీకటం.. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంటే. . ఫాలోఅప్ చేయటంలో వెనుకపడ్డారు.. బాధితులకు సాయంగా ఉండటం లేదే? అంటూ ఆయన నిలదీసిన పరిస్థితి. మరో నెలలో గ్రేటర్ ఎన్నికల హడావుడి ప్రారంభమయ్యే వేళలో.. తాజా భారీ వర్షం కారణంగా నగర జీవనం అస్తవ్యస్తం కావటం.. నగరంలోని లోపాలు కుప్పలా బయటకు రావటంతో.. తాము హైదరాబాద్ కు ఏం చేశామన్న విషయాన్ని చెప్పలేని పరిస్థితి చోటు చేసుకుందని చెబుతున్నారు. ఇప్పటివరకు తమ బలం అనుకున్న విషయాలు బలహీనంగా మారాయని.. ఇది తాము ఊహించని పరిణామంగా వారు చెబుతున్నారు. వర్షం తెచ్చిన వరదతో తమ వంద ఆశలు గల్లంతు అవుతాయన్న భయం గులాబీ నేతల మాటల్లో వినిపించటం అండర్ లైన్ చేసుకోవాలన్న మాట వినిపిస్తోంది.