Begin typing your search above and press return to search.

తొలిసారి; మరెక్కడా లేని రవాణ.. అమరావతిలో

By:  Tupaki Desk   |   23 July 2015 11:25 AM IST
తొలిసారి; మరెక్కడా లేని రవాణ.. అమరావతిలో
X
హాట్ టాపిక్ గా మారిన ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన విశేషాలు ఆసక్తికరంగా ఉంటున్నాయి. ఇప్పుడు చెబుతున్న విషయాలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో తెలీదు కానీ.. కలలు మాత్రం బ్రహ్మాండంగా ఉంటున్నాయి. ఎప్పుడా.. ఎప్పుడా అన్నట్లు ఎదురు చూసేలా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే రోజా చెప్పినట్లు.. అమరావతికి సంబంధించిన విశేషాలు రాజమౌళి.. బాహుబలి సినిమాను తలపించేలా ఉన్నాయన్న మాటలో నిజం ఉందని చెప్పక తప్పదు.

ఏపీ రాజధానికి చెబుతున్న ఏ విశేషం కూడా వెనువెంటనే సాకారమయ్యేది లేదు.. కనీసం మూడేళ్ల నుంచి 35 ఏళ్ల వ్యవధిలో చోటు చేసుకునే విశేషాల్ని మా గొప్పగా చెప్పేస్తున్నారు. తాజాగా.. అమరావతిలో ఏర్పాటు చేసే ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించి ఆసక్తికరమైన విషయాన్ని చెబుతున్నారు.

ప్రజా రవాణా అంటే మనకు తెలిసి.. బస్సు.. లేదంటే రైలు మాత్రమే. నగరాల్లో అయితే.. ఎంఎంటీఎస్.. కాదంటే మెట్రో. అయితే.. ఏపీ రాజధాని అమరావతిలో మాత్రం రోడ్డు.. రైలు కాకుండా అందుకు భిన్నంగా వాటర్ ట్యాక్సీలు కూడా ఉంటాయని చెబుతున్నారు. దేశంలో మరెక్కడా లేని ఈ ప్రజా రవాణా సౌకర్యం రాజధానికి మరింత లుక్ తెచ్చి పెడుతుందని చెబుతున్నారు.

కృష్ణా నదికి అభిముఖంగా నిర్మిస్తున్న అమరావతి నగరాన్ని నదిలోని ఒక పాయను నూతన రాజధాని మధ్యలో నుంచి తీసుకువెళతారని చెబుతున్నారు. ఇలా తీసుకొచ్చిన పాయను చివరకు మళ్లీ కృష్ణా నదిలో కలపనున్నారు. ఈ పాయలో వాటర్ ట్యాక్సీలను ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు.. రైలు రవాణా వ్యవస్థలకు అనుసంధానంగా ఈ వాటర్ ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ పని చేస్తుందని చెబుతున్నారు. ఈ వాటర్ టాక్సీలు ఎప్పటికి అందుబాటులోకి వస్తాయో కానీ.. ఆలోచన మాత్రం అదిరిందనే చెప్పాలి.