Begin typing your search above and press return to search.

​గుజ‌రాత్ పై టాప్ లీడ‌ర్స్ కామెంట్స్ ఇవే !​

By:  Tupaki Desk   |   18 Dec 2017 6:30 PM GMT
​గుజ‌రాత్ పై టాప్ లీడ‌ర్స్ కామెంట్స్ ఇవే !​
X
దేశ‌వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించిన గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫ‌లితాల‌పై పలువురు త‌మ‌దైన శైలిలో స్పందించారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి మొద‌లుకొని స్థానిక నేత‌ల వ‌ర‌కు ఈ ఫ‌లితాల‌పై రియాక్ట‌య్యారు.

- ఈ ఫ‌లితాల‌ను సుపరిపాలన - అభివృద్ధికి ప్రజలు పట్టం కట్టారన్నారు ప్రధాని మోడీ. బీజేపీ పట్ల గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ ప్రజలకు ఉన్న నమ్మకానికి తాను శిరసు వంచి నమస్కరిస్తున్నట్లు ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలను అభివృద్ధిపథంలో నడిపిస్తామని - నిరంతంరంగా సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వికాసం గెలిచింది - గుజరాత్ గెలిచిందని కూడా అన్నారు. రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఇదే రుజువు చేస్తున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల ఫలితాలపై ఇవాళ మోదీ ట్వీట్ చేశారు. రెండు రాష్ర్టాల్లో బీజేపీ గెలుపు కోసం కృషి చేసిన కార్యకర్తలకు ఆయన సెల్యూట్ చేశారు. కార్యకర్తల వల్లే ఆ రాష్ర్టాల్లో విజయదుందుబీ మోగించినట్లు ఆయన చెప్పారు.

--ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. రెండు రాష్ట్రాలలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వాలకు ఆయన ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లో ప్రజలు తనపై చూపించిన ప్రేమ - ఆప్యాయతలకు ధన్యవాదాలు అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.

-గుజరాత్ - హిమాచల్ ప్రజలు కుటుంబ పాలన - కులతత్వం - ఓట్ బ్యాంక్ రాజకీయాలను తిరస్కరించారని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. ప్రధాని మోడీ అభివృద్ధి పథంలో హిమాచల్ కూడా చేరిందన్నారు. మరోసారి అధికారమిచ్చినందుకు గుజరాత్ ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. గుజరాత్ ప్రజలను విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నించిందని ఆరోపించారు. అయితే కాంగ్రెస్ ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టారని అమిత్ షా అన్నారు.

-కాంగ్రెస్ గెలిస్తేనే ఈవీఎంలు సరిగా పని చేస్తున్నట్టా.. అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశ్నించారు . ప్రజాస్వామ్యంలో గెలుపు - ఓటములు స్వీకరించే గుణం పార్టీలకు ఉండాలని పిలుపునిచ్చారు. అభివృద్ధి నిజం కాబట్టే.. మరోసారి బీజేపీని ఓటర్లు గెలిపించారని గడ్కరీ అన్నారు.

- ఇది గొప్ప విజ‌య‌మ‌ని కేంద్ర మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్ అన్నారు. అభివృద్ధికి - సుప‌రిపాల‌నకు ప్ర‌జ‌లు ప‌ట్టం క‌ట్టార‌న్నారు.

-- విభజించి పాలించే కాంగ్రెస్ పార్టీ రాజ‌కీయాల‌ను ప్ర‌జ‌లు తిప్పికొట్టార‌ని యూపీ సీఎం యోగీ ఆదిత్య‌నాథ్ అన్నారు. బీజేపీ సార‌థ్యంలో - కార్య‌క‌ర్త‌ల శ్ర‌మ ఫ‌లిత‌మే ఈ విజ‌య‌మ‌ని ఆయ‌న కొనియాడారు.

-- భారత్ నుంచి కాంగ్రెస్ ను తుడిచేయాలని చూడొద్దని..ప్రతి ఇంట్లో సుఖ సంతోషాల కోసం పనిచేయండంటూ కాంగ్రెస్ అధికార ప్రతినిధి సుర్జేవాలా బీజేపీకి చురకలంటించారు. ఛాతి పెద్దదిగా ఉండటం కాదు హృదయం విశాలంగా ఉండటం ముఖ్యమన్నారు. అహంకారులకు గుజరాత్ ప్రజలు గుణపాఠం నేర్పారన్నారు. బీజేపీ గెలిచిన చాలా చోట్ల వెయ్యి కంటే తక్కువ మార్జిన్ ఉందన్నారు. ఇప్పటికైనా బీజేపీ ప్రజా సమస్యలు పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామన్నారు.

-గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నైతికంగా ఓడిపోయిందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి - పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. బీజేపీ విజయం తాత్కాలికమని - చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా కాషాయం పార్టీ గెలిచిందని వ్యాఖ్యానించారు.

- ప్ర‌ధానిపై ఉన్న భ‌రోసాకు ఈ ఫ‌లితాలు అద్దం ప‌డ‌తాయ‌ని క‌ర్ణాట‌క మాజీ ముఖ్య‌మంత్రి బీఎస్ య‌డ్యూర‌ప్ప తెలిపారు. రాబోయే కాలంలో క‌ర్ణాట‌క‌లో ఇదే త‌ర‌హా ఫ‌లితాలు వ‌స్తాయ‌న్నారు.

-ట్యాంపరింగ్ చేసి గెలిచిన బీజేపీకి అభినందనలు అంటూ పాటిదార్ ఉద్యమ నేత హార్దిక్ పటేల్. గుజరాత్ ప్రజల నిర్ణయాన్ని స్వాగతిస్తాను అంటూనే.. పాటిదార్ ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామన్నారు. ధన ప్రవాహం - ఈవీఎం ట్యాపరింగ్ వల్ల బీజేపీ గెలిచిందని ఆరోపించారు. హార్దిక్ మ్యాజిక్ పనిచేయలేదని అనుకోవడం కరెక్ట్ కాదని.. తాను కేవలం పాటిదార్ ఉద్యమకారుడినని మాత్రమే అన్నారు. ఏటీఎంల నుంచి పేపర్ వస్తున్నప్పుడు.. ఈవీఎంల నుంచి ఎందుకు రావని ప్రశ్నించారు.

- త‌న ఓట‌మి త‌న‌కు వ్య‌క్తిగ‌తంగా న‌ష్ట‌మేన‌ని కానీ రాష్ట్రంలో బీజేపీ పార్టీ బ‌ల‌ప‌డ‌డం సంతోష‌క‌ర విష‌య‌మ‌ని హిమాచల్‌ప్రదేశ్‌లో బీజేపీ సీఎం అభ్యర్థిగా బ‌రిలో నిలిచిన‌ ప్రేమ్ కుమార్ ధుమాల్ అన్నారు. బీజేపీకి ఓటేసిన రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ఆయ‌న థ్యాంక్స్ చెప్పారు. సాధార‌ణంగా రాజ‌కీయాల్లో ఒక‌రు గెలుస్తుంటారు, ఓడిపోతుంటారు, కానీ నేను ఓడిపోతాన‌ని అనుకోలేదు - అసలు ఏం జ‌రిగిందో దాని గురించి విశ్లేషిస్తామ‌ని ధుమాల్ తెలిపారు.

- ఎన్నిక‌ల సార‌థులు ప్ర‌ధాని మోడీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు అభినంద‌న‌లు తెలిపారు. అభివృద్ధి కోసం క‌ష్ట‌ప‌డిన పార్టీని ప్ర‌జ‌లు ఆద‌రిస్తార‌ని ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించారు.

-గుజరాత్ - హిమాచల్ ప్రదేశ్ లలో విజయం సాధించినందుకు ప్రధాని మోడీకి - బీజేపీకి రాష్ట్ర మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. మరోవైపు స్ఫూర్తివంతమైన పోటీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి కూడా అభినందనలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా రెండు జాతీయపార్టీలకు కేటీఆర్ అభినందనలు తెలిపారు . సుపరిపాలన దిశగా రాజకీయాలుంటాయని భావిస్తున్నాన‌ని అన్నారు.

- 2019 ఎన్నికల్లో ఏపీలో తామే హీరోలమవుతామని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు జోస్యం చెప్పారు. ఈ ఫలితాలు ఏపీ - తెలంగాణను ప్రభావితం చేస్తాయని వ్యాఖ్యానించారు. బీజేపీ ఓడిపోతుందని భావించిన నేతలకు ఈ ఫలితాలు చెప్పు దెబ్బవంటివి అన్నారు.


​​