Begin typing your search above and press return to search.

దేశంలోనే ప్రముఖ కాంట్రాక్టర్.. ఫ్యామిలీ మొత్తం అనూహ్యం గా చని పోయారు

By:  Tupaki Desk   |   1 Jan 2020 7:19 AM GMT
దేశంలోనే ప్రముఖ కాంట్రాక్టర్.. ఫ్యామిలీ మొత్తం అనూహ్యం గా చని పోయారు
X
ఆయన దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరు. వేలాదికోట్ల రూపాయిల ప్రాజెక్టుల్ని చేసేస్తుంటారు. అలాంటి ఆయన.. ఆయన కుటుంబ సభ్యులంతా ఒకే ఘటనలో ప్రాణాలు (భార్య పరిస్థితి విషమంగా ఉంది) కోల్పోవటం చూస్తే షాక్ కు గురి కావటం ఖాయం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వేళ.. ఆనందం తో ఏర్పాటు చేసిన పార్టీ విషాదాన్ని నింపటమే కాదు.. పలు అనుమానాలకు తావిచ్చేలా ఉండటం గమనార్హం.


వివరాల్లోకి వెళితే మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలోని పాటల్ పానీలో పునీత్ అగర్వాల్ ఫామ్ హౌస్ లో న్యూఇయర్ పార్టీ జరుగుతోంది. ఈ పార్టీలో పాల్గొనేందుకు వీలుగా కుటుంబ సభ్యులంతా చేరుకున్నారు. నిర్మాణంలో ఉన్న భవనం పైకి వెళ్లేందుకు లిఫ్ట్ లో ఎక్కారు. అనూహ్యంగా లిఫ్ట్ తీగ తెగిపోయింది. దీంతో వంద మీటర్ల ఎత్తు నుంచి అది కాస్తా కూలిపోయింది. లిఫ్ట్ తీగ ప్రమాదవశాత్తు తెగినట్లుగా చెబుతున్నారు.

దీంతో వేగంగా కింద పడిన లిఫ్ట్ కాంక్రీట్ గుంతలో పడటంతో.. పునీత్ అగర్వాల్ (53).. ఆయన కుమార్తె పాలక్ (27).. అల్లుడు పాల్కేశ్.. మనమడు నవ్ తో పాటు బంధువులు గౌరవ్.. అర్యవీర్ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో పునీత్ సతీమణి నిధి అగర్వాల్ తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు. దేశంలోనే అతి పెద్ద కాంట్రాక్టర్లలో ఒకరైన ఆయన కుటుంబం మొత్తం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవటం గమనార్హం.

పాత్ ఇండియా సంస్థ ద్వారా బ్రిడ్జ్ ల పర్యవేక్షణ.. హైవే నిర్మాణాలు.. టోల్ ప్లాజాలతో పాటు అనేక రాష్ట్రాల్లో కీలకమైన రోడ్డు ప్రాజెక్టుల్ని చేస్తుంటారు. అంత సంపన్నుడు ప్రయాణించే లిఫ్ట్ తీగలు తెగిపోవటమా? అన్న క్వశ్చన్ కు సమాధానం పోలీసుల విచారణలో తేలనుందని చెప్పక తప్పదు. కొత్త సంవత్సరం అడుగు పెడుతున్న వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదం ఇప్పుడు హైప్రొఫైల్ సర్కిల్స్ లో సంచలనంగా మారింది.