Begin typing your search above and press return to search.

జగన్ సర్కార్ పై హైకోర్టుకు కృష్ణంరాజు, అశ్వినీదత్

By:  Tupaki Desk   |   29 Sep 2020 3:30 AM GMT
జగన్ సర్కార్ పై హైకోర్టుకు కృష్ణంరాజు, అశ్వినీదత్
X
టాలీవుడ్ సెగ ఏపీలోని జగన్ సర్కార్ కు తగిలింది. ప్రముఖ టాలీవుడ్ నటుడు కృష్ణం రాజుతోపాటు నిర్మాత అశ్వినీదత్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించడం సంచలనంగా మారింది.

గన్నవరం ఎయిర్ పోర్టు విస్తరణకు ఇచ్చిన భూముల్లో తమ భూములు కూడా ఉన్నాయని.. వాటికి తగిన నష్టపరిహారం చెల్లించాలని పిటీషన్లు దాఖలు చేశారు.

ప్రముఖ నిర్మాత అశ్వినీదత్‌కు గన్నవరం విమానాశ్రయానికి సమీపంలో 39 ఎకరాల భూమి ఉంది. గత ఏపీ ప్రభుత్వం విమానాశ్రయం విస్తరణ కోసమే ఆ భూమిని కొనుగోలు చేసింది. దీనికి ప్రతిగా, అమరావతిలో అదే స్థలాన్ని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. కానీ ప్రభుత్వం మారిన తరువాత అమరావతి రాజధాని మార్చడం.. ఆ భూమి విలువ పడిపోవడంతో ఇప్పుడు న్యాయం చేయాలని అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించారు.

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దేందుకు అప్పటి ప్రభుత్వం తన 31 ఎకరాల భూమిని తీసుకుందని కృష్ణంరాజు మరో పిటీషన్ ను మైకోర్టులో వేశారు. రాజధాని తరలింపు నేపథ్యంలో తనకు కూడా నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోరారు.

2013 భూసేకరణ చట్టం ప్రకారం తనకు నష్టపరిహారం ఇవ్వాలని అశ్వినీదత్ కోర్టును కోరారు. ఎకరా రూ.1.54 కోట్లు ఉంటుందని.. దానికి సరిసమానమైన భూమిని అమరావతిలో ఇస్తామని అప్పటి ప్రభుత్వం ఇచ్చిందని.. రాజధాని తరలింపుతో అక్కడ విలువ పడిపోయిందని.. కాబట్టి తనకు నష్టపరిహారంగా మొత్తం రూ.210 కోట్లు ఏపీ ప్రభుత్వం ఇవ్వాలని అశ్వినీదత్ కోరారు.

కృష్ణం రాజు, అశ్వినీదత్ పిటీషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

గత టీడీపీ ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కింద గన్నవరం ఎయిర్ పోర్టు కోసం 760 ఎకరాల భూమిని సేకరించింది. ఎకరం రూ.2 కోట్లు మార్కెట్ విలువ కలిగిన ఈ భూములను తీసుకొని అమరావతి రాజధానిలో ప్యాకేజీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ జగన్ సర్కార్ మూడు రాజధానులను మార్చి విశాఖను పరిపాలన రాజధానిగా చేయడంతో నష్టపోయిన ల్యాండ్ ఫూలింగ్ బాధితులు హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.