Begin typing your search above and press return to search.

‘తిరుపతి’ కోసం సమన్వయ కమిటి ఏర్పాటు

By:  Tupaki Desk   |   17 Dec 2020 2:00 PM IST
‘తిరుపతి’ కోసం సమన్వయ కమిటి ఏర్పాటు
X
తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో గెలుపు వ్యూహంతో చంద్రబాబునాయుడు కాస్త దూకుడు పెంచారు. ఆరుగురు సీనియర్ సభ్యులతో సమన్వయకమిటిని నియమించారు. ఈ కమిటిలో చిత్తూరు జిల్లా నుండి ఇద్దరిని, నెల్లూరు జిల్లా నుండి ముగ్గురిని నియమించిన చంద్రబాబు ప్రకాశం జిల్లా నుండి ఒకరికి అవకాశం ఇచ్చారు. మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నేతృత్వంలో పనిచేయబోతున్న ఈ కమిటిలో మాజీ మంత్రి అమరనాధరెడ్డి, నరసింహయాదవ్, ఎంఎల్సీ బీద రవిచంద్రయాదవ్, అభ్యర్ధి పనబాక కృష్ణయ్యతో పాటు మాజీ ఎంఎల్ఏ ఉగ్ర నరసింహారెడ్డి ఉన్నారు.

మిగిలిన పార్టీలతో పోల్చుకుంటే చంద్రబాబు దూకుడుమీదున్నారనే చెప్పాలి. ఎలాగంటే ఉపఎన్నికలకు నోటిఫికేషన్ ఇంకా రాకముందే అభ్యర్ధిగా పనబాక లక్ష్మిని ప్రకటించేశారు. అభ్యర్ధిని ప్రకటించేసి కూడా సుమారు మూడు వారాలవుతోంది. అలాగే తిరుపతి లోక్ సభ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలతో ఇప్పటికే రెండుసార్లు జూమ్ యాప్ కాన్ఫరెన్సు నిర్వహించారు. తాజాగా నేతలను, కార్యకర్తలను సమన్వయం చేసుకునేందుకు సమన్వయ కమిటిని కూడా నియమించారు.

తిరుపతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని సీనియర్లందరితో స్వయంగా చంద్రబాబు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు. తాను మాట్లాడటమే కాకుండా పనబాక లక్ష్మితో కూడా మాట్లాడించారు. తన కూతురు వివాహం జనవరి 6వ తేదీ అయిపోగానే నేరుగా ప్రచారంలోకి దిగుతానని పనబాక చెప్పారు. అప్పటివరకు తన తరపున పార్టీ కోసమని ప్రచారం చేయాల్సిందిగా ఇప్పటికే కొందరిని పనబాక రిక్వెస్టు చేసుకున్నారు.

ఇక వైసీపీ విషయం చూస్తే డాక్టర్ గురుమూర్తి పోటీ చేస్తారని జగన్మోహన్ రెడ్డి నేతలతో జరిగిన సమావేశంలో చెప్పినట్లు ప్రచారంలో ఉంది. అయితే అధికారికంగా ఇంతవరకు ప్రకటన రాలేదు. అయితే దివంగత ఎంపి బల్లి దుర్గాప్రసాదరావు కుటుంబంలో మాత్రం ఎవరికీ టికెట్ ఇచ్చే ఉద్దేశ్యంలో లేనట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లిలో ఓ రకంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేసింది వైసీపీ. అలాగే బీజేపీ మంచి దూకుడు చూపిస్తున్నప్పటికీ అభ్యర్ధి ఎవరో మాత్రం ప్రకటించలేదు. ఉపఎన్నికలో పోటీ చేసే విషయమై జనసేన బాగా ఇంట్రస్టు చూపుతున్నప్పటికీ చివరకు కమలంపార్టీ ఒత్తిడికి తలొంచక చేసేది లేదు.