Begin typing your search above and press return to search.

తిరుపతి బైపోల్: వైసీపీ ముందుగానే సర్దుకుంది

By:  Tupaki Desk   |   17 Dec 2020 9:34 AM IST
తిరుపతి బైపోల్: వైసీపీ ముందుగానే సర్దుకుంది
X
తెలంగాణలో దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు తగిలిన ఎదురుదెబ్బలు దృష్ట్యా.. ఏపీలోని అధికార వైసీపీ అలెర్ట్ అయ్యింది. ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నికల అభ్యర్థిని టీడీపీ ప్రకటించి ఏకంగా సమన్వయ కమిటీని కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో వైసీపీ రంగంలోకి దిగింది.

ఇప్పటికే జనసేనాని పవన్ రైతుల పేరుతో తిరుపతి పరిధిలో చుట్టివచ్చారు. ఇక బీజేపీ వరుస మీటింగ్ లతో హోరెత్తిస్తోంది. అందుకే వెనుకబడ్డ వైసీపీ తాజాగా ప్రచారపర్వాన్ని మొదలుపెట్టేసింది. తిరుపతి పార్లమెంట్ పరిధిలోని సర్వేపల్లిలో వైసీపీ తొలి బహిరంగ సభ సక్సెస్ అయ్యింది. ఏకంగా ఐదుగురు వైసీపీ మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరై తిరుపతి ఉప ఎన్నికల ప్రచార నగారాను మోగించారు.

సచివాలయాల ప్రారంభోత్సవం పేరుతో సాగిన ఈ సభలో చనిపోయిన తిరుపతి ఎంపీ దుర్గాప్రసాద్ కుమారుడితోనే ప్రచార తొలి ఉపన్యాసం చేయించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తమ కుటుంబానికి జగన్ టికెట్ ఇవ్వడం లేదన్న ప్రతిపక్షాల విమర్శలను దుర్గప్రసాద్ తనయుడు ఖండించాడు. జగన్ తమకు న్యాయం చేస్తాడని తెలిపారు.

అయితే ఈ సభలో అభ్యర్థి ఎవరో ప్రకటించకుండానే.. ఖరారు చేయకుండా మంత్రులంతా తిరుపతిలో వైసీపీని గెలిపించాలని కోరడం విశేషం. తిరుపతి పార్లమెంట్ పరిధిలో అందరూ వైసీపీ ఎమ్మెల్యేలే కావడంతో ఇక్కడ వైసీపీ గెలుపు సునాయాసంగానే కనిపిస్తోంది. అయితే జగన్ చనిపోయిన దుర్గాప్రసాద్ కొడుక్కి టికెట్ ఇస్తాడా? కొత్తగా బయట వ్యక్తికి ఇస్తాడా? అన్నది ఇక్కడ ఆసక్తిగా మారింది. మంత్రులంతా కలిసి వచ్చిన వేళ తిరుపతి ఉప ఎన్నికపై వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.