Begin typing your search above and press return to search.

టిక్ టాక్ పరిచయం.. ప్రాణాల్ని తీసేసింది!

By:  Tupaki Desk   |   1 Sept 2019 10:04 AM IST
టిక్ టాక్ పరిచయం.. ప్రాణాల్ని తీసేసింది!
X
సోషల్ మీడియా పుణ్యమా అని కొత్త కొత్త పరిచయాలకు కొదవ ఉండట్లేదు. సంబంధం లేని వారి మధ్య సరికొత్త సంబంధాలకు తెర తీస్తున్న వైనం కొత్త తరహా విపరిణామాలకు తెర తీస్తోంది. తాజాగా హైదరాబాద్ లోని అమీర్ పేటలో చోటు చేసుకున్న ఉదంతం ఇందుకు నిదర్శనంగా చెప్పాలి. హైదరాబాద్ లోని ఎస్సార్ నగర్ కు చెందిన పుడ్ డెలివరీ బాయ్ 24 ఏళ్ల సాయి తాజాగా ఆత్మహత్య చేసుకున్నాడు.

నిన్నటి వరకూ హుషారుగా పని చేసిన కుర్రాడు.. ఈ రోజు ప్రాణాలు తీసుకునే వరకూ విషయం ఎందుకు వెళ్లింది? దాని కారణం ఏమిటన్న విషయాల్లోకి వెళితే.. షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. ఇటీవల కాలంలో యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్న టిక్ టాక్ మోజులో పడిపోయి.. రోజులో ఎక్కువసేపు దాంతోనే గడిపేసేవాడు సాయి. ఈ క్రమంలో అతడికి కర్నూలుకు చెందిన అమ్మాయితో పరిచయమైంది.

కొద్ది రోజులకే ఆ పరిచయం కాస్తా స్నేహంగా.. ఆపై ప్రేమగా మారి తరచూ కలుసుకునేవారు. తనకున్న ఆర్థిక అవసరాల కోసం ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకునేవాడు. ఇటీవల అతడికి డబ్బు మరింత అవసరం కావటంతో.. ఆమె తన బంగారు గొలుసును ఇచ్చింది. దాన్ని తనఖా పెట్టుకొని డబ్బును వాడుకున్నాడు. ఆ గొలుసు అవసరం కావటంతో దాన్ని తనకు తిరిగి ఇచ్చేయాలని కోరిందా యువతి. కానీ.. తిరిగి ఇవ్వలేకపోవటంతో వారిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

దీంతో.. తాను సాయికి గొలుసు ఇచ్చిన విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పేసిందా అమ్మాయి. దీంతో.. ఆగ్రహం చెందిన వారు.. సాయి మీద కర్నూలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయటం.. అతడిపై కేసు నమోదు కావటం జరిగిపోయాయి. ఈ విషయం తెలుసుకున్న సాయి.. మనస్తాపంతో ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ వైనం ఇప్పుడు స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది.