Begin typing your search above and press return to search.

దాసన్నకు చెక్ : బగ్గు ఫ్యామిలీ నుంచి యువ డాక్టర్...?

By:  Tupaki Desk   |   20 Jun 2022 3:14 AM GMT
దాసన్నకు చెక్ : బగ్గు ఫ్యామిలీ నుంచి యువ డాక్టర్...?
X
శ్రీకాకుళం జిల్లాలో అతి కీలకమైన నియోజకవర్గం నరసన్నపేట. అక్కడ ధర్మాన ఫ్యామిలీకి మంచి పట్టు ఉంది. 1989 నుంచి ఈ ఫ్యామిలీ మూడు దశాబ్దాలుగా కంచుకోటగా మార్చుకున్న సీటు ఇది. ఇక్కడ ఉప ఎన్నికతో కలిపి మొత్తం ఎనిమిది సార్లు ఎన్నికలు జరిగితే ఆరు సార్లు ధర్మాన బ్రదర్స్ గెలిచారు. 1989లో తొలిసారి ధర్మాన ప్రసాదరావు గెలిచి మంత్రి కూడా అయ్యారు. అలా పట్టు సాధించినా 1994లో ఎన్టీయార్ వేవ్ లో ఆయన ఓడారు.

ఇక 1999లో రెండవమారు గెలిచిన ప్రసాదరావు 2004 నాటికి శ్రీకాకుళం షిఫ్ట్ అయ్యారు. దాంతో నాటి నుంచి నాలుగు సార్లు క్రిష్ణదాస్ గెలిచారు. 2014లో మాత్రం ఓడిపోయారు. 2019 ఎన్నికల తరువాత మూడేళ్ళ పాటు ఆయన ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా నిర్వహించారు.

ఇంతటి కీలకమైన బాధ్యతలు చేపట్టినా నరసన్నపేటలో మాత్రం ఇటీవల ఆయన గారి పట్టు జారింది అని సర్వేలు చెబుతున్నాయి. క్రిష్ణదాస్ ఉప ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన వారసులు చేసిన కొన్ని అతి చర్యలు తప్పిదాలు అధికార దాష్టికాల వల్లనే దాసన్న పలుకుబడి జనంలో పలచబడింది అని అంటున్నారు. లేటెస్ట్ గా వైసీపీ నిర్వహించిన సర్వేలో సైతం కేవలం పాస్ మార్క్లే దాసన్నకు వచ్చాయట. మరో రెండేళ్ళలో ఎన్నికలు ఉంటే పాస్ అవుతారా అన్న డౌట్లు ఇప్పటి నుంచే పట్టుకున్నాయట.

ఇదిలా ఉంటే ఇపుడు దాసన్నకు చెక్ పెట్టడానికి అక్కడ రెండు సార్లు టీడీపీ తరఫున గెలిచిన భగ్గు ఫ్యామిలీ నుంచే యువ నేతను బరిలోకి దింపే ప్లాన్ లో లోకేష్ ఉన్నారని అంటునారు. 1994లో టీడీపీ తరఫున గెలిచిన బగ్గు లక్ష్మణరావు కుమారుడు డాక్టర్ శ్రీనివాసరావుకే ఈసారి టికెట్ ఇవ్వాలని దాదాపుగా తీర్మానించారు అని అంటున్నారు. ఆయన ప్రజా వైద్యునిగా ఉంటూ ప్రజలలో మంచి పేరు తెచ్చుకున్నారు. అదే విధంగా ఆయన తండ్రి రాజకీయాల్లో ఉండడంతో ఆ వర్గం కూడా మద్దతు ఉంది.

ఇక దాసన్నకు పట్టున కొన్ని సెగ్మెంట్లు అంటే జమ్ము, తామరాపల్లి, మాకివలస వంటి చోట్లనే ఇపుడు వైసీపీకి ఎదురుగాలి వీస్తోంది. సరిగ్గా అక్కడ ఈ యువ నేతకు ఆదరణ ఉందిట. దాంతో ఆయనే మన అభ్యర్ధి అని అనధికారికంగా నిర్ణయించుకున్నారని టాక్. మొత్తానికి 2014లో తనకు టికెట్ ఇచ్చారు గెలిచాను, 2024లో కూడా ఇస్తే మరోసారి సత్తా చాటుతాను అని బగ్గు రమణమూరి అన్నా కూడా ఆయనకు ఆర్ధికంగా బలం లేకపోవడంతో పక్కన పెట్టి ఈ యువ డాక్టర్ మీద టీడీపీ మనసు పడింది అంటున్నారు.

మొత్తానికి చూస్తే ఈ రోజుకు పాస్ మార్కులతో ఉన్న దాసన్న రిపేర్లు గట్టిగా చేసుకుని నిలదొక్కుకోకపోతే మాత్రం యువ డాక్టర్ పేటలోనూ దాసన్న కోటలోనూ వైసీపీ రాజకీయాన్ని భ‌గ్గుమని మండించేసి తాను ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి దాసన్న మరమ్మతులు ఏం చేస్తారో ఎలా బయటపడతారో.