Begin typing your search above and press return to search.

దాచేపల్లిలో దారుణం.. కుక్కను తప్పించబోయి ముగ్గురి మరణం

By:  Tupaki Desk   |   1 Sep 2020 10:29 AM GMT
దాచేపల్లిలో దారుణం.. కుక్కను తప్పించబోయి ముగ్గురి మరణం
X
ఏపీలోని గుంటూరు జిల్లా దాచేపల్లిలో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంతో వెళుతున్న కారు.. రోడ్డుకు అడ్డంగా వచ్చిన కుక్కను తప్పించబోయిన ఉదంతంలో ముగ్గురు మరణించిన వైనం ఇప్పుడు షాకింగ్ గా మారింది. అంతేకాదు..మరో ముగ్గురు ప్రమాదంలో గాయపడ్డారు. విన్నంతనే అయ్యో అనిపించే ఈ ఉదంతంలోకి వెళితే..

హైదరాబాద్ శివారులోని ఇంజనీరింగ్ కాలేజీలో రమణమ్మ.. ఆమె కుమారుడు పని చేసేవారు. రమణమ్మది నెల్లూరు జిల్లా. ఊళ్లో ఉన్న తల్లిని చూసేందుకు తన కుమారుడు.. అతని స్నేహితులతో కలిసి కారులో నెల్లూరు జిల్లాకు బయలుదేరారు. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం గామాలపాడు సమీపంలోని పెట్రోల్ బంక్ వద్దకు వీరి కారు వచ్చినంతనే.. రోడ్డుకు అడ్డంగా కుక్క వచ్చింది.

దాన్ని తప్పించే క్రమంలో కారు అదుపు తప్పింది. వేగంగా వెళుతున్న కారు.. కుక్కను తప్పించబోయి ఒక్కసారిగా పక్కకు తిప్పారు. దీంతో కారు డివైడర్ ను ఢీ కొట్టింది. దీంతో.. పల్టీలు కొట్టుకుంటూ సమీపంలోని ఒక షాపు మీద పడింది. ఈ షాకింగ్ పరిణామంలో రమణమ్మ.. డ్రైవర్ అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరు చికిత్స పొందుతూ మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మెరుగైన వైద్యం కోసం గురజాల ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు.