Begin typing your search above and press return to search.

యాక్సిడెంట్ లో తండ్రి.. కరోనాతో తల్లి.. అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు

By:  Tupaki Desk   |   26 May 2021 12:06 PM IST
యాక్సిడెంట్ లో తండ్రి.. కరోనాతో తల్లి.. అనాథలుగా మారిన ముగ్గురు పిల్లలు
X
కరోనా వైరస్ కుటుంబాల్లో పెను విషాదం నింపుతోంది. కరోనా సోకడంతో దేశ వ్యాప్తంగా చాలా కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి. కరోనా మహమ్మారి బారిన పడి కుటుంబం నుంచి ముగ్గురు, నలుగురు మరణించిన ఘటనలు చాలానే ఉన్నాయి. అలాంటి ఘటనే మరొకటి వెలుగులోకి వచ్చింది. రెండేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించాడు. ఇక అప్పటి నుండి అన్ని తానై చూసుకుంటున్న తల్లిని కరోనా మింగేయడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. ముక్కు పచ్చలారని వయసులో తల్లిదండ్రులను కోల్పోయి సాయం చేసే వారి కోసం ఎదురు చూస్తున్నారు. ఈ సమాచారంతో వారిని ఆదుకుంటామని ఆరోగ్య మంత్రి ఎం. సుబ్రమణ్యం ప్రకటించారు. కుటుంబ పెద్దలను కోల్పోయి ఎన్నో కుటుంబాలు కన్నీటి మడుగులో మునిగిపోయాయి. ఒకే కుటుంబంలోని ముగ్గురు పిల్లలు అనాథలుగా మారడం తిరునల్వేలి జిల్లా ముడించి పట్టి గ్రామ వాసులను శోక సంద్రంలో ముంచింది.

వివరాల్లోకి వెళ్తే .. ముడించిపట్టి తుత్తికులానికి చెందిన జప మాణిక్య రాజ్, జ్ఞానమరియ సెల్వి దంపతులకు కమారులు ధర్మరాజ్‌, స్టీఫన్‌ రాజ్‌ ,సెల్విన్‌ ఉన్నారు. లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్న మాణిక్య రాజ్‌ రెండేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశాడు. సెల్వి కష్టాన్ని గుర్తించిన స్థానిక అధికారులు అంగన్‌ వాడీలో కాంట్రాక్టు ఉద్యోగాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో కరోనా బారిన పడిన సెల్వి రెండు రోజుల క్రితం మృతిచెందింది. తల్లిదండ్రులు లేకపోవడంతో ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. దిక్కు తోచని స్థితిలో ఉన్న ఆ పిల్లలను వయో భారంతో ఉన్న నాన్నమ్మ మాసమ్మ తీసుకెళ్లి ఆలనాపాలన చూడాల్సిన పరిస్థితి. తల్లిదండ్రుల పెళ్లి నాటి ఫొటోను చేతిలో ఉంచుకుని కన్నీటి పర్యంతం అవుతున్న ఈ పిల్లల విషయాన్ని తూత్తుకుడికి వచ్చిన ఆరోగ్య మంత్రి సుబ్రమణ్యం దృష్టికి ఓ మీడియా తీసుకెళ్లింది. సీఎం స్టాలిన్‌తో చర్చించి ప్రభుత్వ పరంగా, డీఎంకే పార్టీ పరంగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. అలాగే తిరునల్వేలి కలెక్టర్‌ విష్ణు స్పందిస్తూ వృద్ధురాలైన ఆ పిల్లల నానమ్మకు తక్షణం రూ. వెయ్యి పింఛన్‌ మంజూరయ్యే విధంగా ఆదేశించారు. ఇక, అరోరా అనే సంస్థకు చెందిన దివ్య భారతి కరోనా పరిస్థితులు తగ్గినానంతరం ఆ పిల్లలను కలుస్తామని, చదువుకు అవసరమయ్యే ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.